షర్మిల కీలక నిర్ణయం ?

రాబోయే తెలంగాణా ఎన్నికల విషయంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే ఎన్నికల్లో షర్మిల పార్టీ ఒంటరిగానే పోటీచేయాలని. ఇంతకాలం కాంగ్రెస్ లో విలీనమా ? పొత్తా అని ఊగిసలాడారు. చివరకు విలీనమనే నిర్ణయించారు. అదికూడా ఇపుడా రేపా అన్నట్లుగా మూడునెలలు సాగింది. చివరకు తెరవెనుక ఏమైందో ఏమో పొత్తూ లేదు విలీనమూ లేదని తేలిపోయింది. ఈ నేపధ్యంలోనే 119 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించేందుకు షర్మిల రెడీ అయ్యారు.

ఇందులో భాగంగానే ఈరోజు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతోంది. అందుబాటులోని సమాచారం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో షర్మిల రెండుచోట్ల నుండి పోటీచేయబోతున్నారట. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీలో పోటీచేయబోతున్నట్లు స్వయంగా ఆమె ప్రకటించారు. అయితే దానికి అదనంగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ అసెంబ్లీ నుండి కూడా పోటీచేయబోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. పాలేరంటే ఏదోలే అనుకోవచ్చు మరి మిర్యాలగూడ నుండి కూడా ఎందుకు పోటీచేయాలని అనుకుంటున్నారో తెలీదు.

ఇది సరిపోదన్నట్లు తల్లి విజయమ్మ సికింద్రాబాద్ అసెంబ్లీ నుండి పోటీచేయాలని డిసైడ్ అయ్యారట. బహుశా సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో క్రిస్తియన్లు ఎక్కువగా ఉన్న కారణంగా విజయమ్మ ఇక్కడి నుండి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లున్నారు. అల్లుడు బ్రదర్ అనీల్ సువార్తకూటములని, ఏసు వచనాలని క్రైస్తవ యాక్టివిటీస్ లో బాగా బిజీగా ఉంటారని అందరికీ తెలిసిందే. కాబట్టి క్రిస్తియన్ ఓట్లన్నింటినీ విజయమ్మకు గంపగుత్తగా వేయించగలమని అంచనా వేసుకున్నట్లున్నారు.

అందుకనే విజయమ్మ ఏరికోరి సికింద్రాబాద్ అసెంబ్లీని ఎంపికచేసుకున్నది. అయితే షర్మిల మిర్యాలగూడ, విజయమ్మ సికింద్రాబాద్ నుండి పోటీచేయటం అధికారికం కాదు. పార్టీలో అయితే బాగా చర్చ మొదలైంది. ఇక్కడ సమస్య ఏమిటంటే కాంగ్రెస్ లో విలీనం పేరుతో షర్మిల దాదాపు మూడు నెలలు జరిపిన డ్రామాతో బాగా బ్యాడ్ ఇమేజి వచ్చేసింది. అసలే పార్టీకి తెలంగాణాలో గుర్తింపురాలేదు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ లో విలీనమంటే ఏదోరకంగా గట్టెక్కవచ్చని అనుకున్నట్లున్నారు. అలాంటిది కథమొత్తం అడ్డం తిరగటంతో ఏమిచేయాలో అర్ధంకాక అన్నీ నియోజకవర్గాల్లో ఒంటరిపోకి దిగుతున్నట్లున్నారు.