తెలంగాణ‌లో 20 మంది అధికారుల‌పై ఈసీ వేటు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైన ద‌రిమిలా.. ఒకే రోజు.. ఒకే సారి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. ఏకంగా 20 మంది అత్యున్న‌తాధికారు ల‌ను ఎన్నిక‌ల విధుల నుంచి త‌ప్పిస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యం అధికార బీఆర్ ఎస్ పార్టీకి ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర సంక‌టంగా మార‌నుంద‌నే వాద‌న వినిపిస్తోంది.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం వేటు వేసిన వారిలో నలుగురు జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది జిల్లాల ఎస్పీలు, ఎక్సైజ్ శాఖ‌ డైరెక్టర్‌, క‌మ‌ర్షియ‌ల్ టాక్స్‌ కమిషనర్‌, రవాణాశాఖ కార్యదర్శి ఉన్నారు. వీరిని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు దూరంగా ఉంచాల‌ని, వారికి ఎలాంటి ప‌నులు అప్ప‌గించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నాలుగు లేఖలను పంపించింది.

ఏం జ‌రిగింది?

ఏ రాష్ట్రంలో అయినా అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూలు విడుదలకు సుమారు నెల రోజుల ముందు నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఇంటెలిజెన్స్‌ విభాగాలను కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దింపుతుంది. వారి ద్వారా.. స‌మాచారం తెచ్చుకుని, ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప‌నిచేస్తున్న ఉన్న‌తాధికారుల‌ను గుర్తించి.. వారిని బ‌దిలీ చేస్తుంది. చిన్న‌స్థాయి అధికారులు అయితే.. మంద‌లించి వదిలేస్తుంది.

2019 ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఏకంగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శినే అప్ప‌టి ఎన్నిక‌ల సంఘం ప‌క్క‌న పెట్టేసిన విష‌యం ప్ర‌స్తావ‌నార్హం. ఇలా.. ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తార‌నో.. లేక ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప‌నిచేస్తార‌నో ఉద్దేశంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌న విశేష అధికారాల‌ను వినియోగించ‌డం ప‌రిపాటి. ఈ ఏడాది క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ అక్క‌డి డీజీపీ(ప్ర‌స్తుత సీబీఐ అధిప‌తి)ని ఎన్నిక‌ల సంఘంప‌క్క‌న పెట్టింది.

ఇలా.. ఇప్పుడు తెలంగాణ‌లోనూ ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంద‌ని భావించాల్సి ఉంటుంది. అయితే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై రాజ‌కీయ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటోంద‌ని వ‌స్తున్న విమ‌ర్శ‌లు.. తెలంగాణ‌లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ఉన్న నేప‌థ్యం లో తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఏకంగా ఒకేసారి 20 మంది అదికూడా క‌మిష‌న‌ర్లు, క‌లెక్ట‌ర్లు స్థాయి అధికారుల‌ను సుప్త‌చేత‌నావ‌స్థ‌లో పెట్ట‌డం ద్వారా.. ఎన్నిక‌ల సంఘం త‌న విశేష అధికారాల‌ను వినియోగించ‌డం చ‌ట్టం ప‌రంగా త‌ప్పుకాదు. కానీ, రాజ‌కీయంగా తెలంగాణ‌లో వాడి వేడి పోరు సాగుతున్న నేప‌థ్యంలో కేసీఆర్ స‌ర్కారును ఎలాగైనా గ‌ద్దె దింపాల‌న్న ఉద్దేశంతో ఉన్న కేంద్రంలోని పెద్దల ప్ర‌మేయం ఉందేమోన‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు కూడా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే, కేసీఆర్‌ను, ఆయ‌న స‌ర్కారును విమ‌ర్శించే ప్ర‌తిప‌క్షాల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యం మ‌రో ఆయుధం అందించిన‌ట్టు అయింద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. విధుల‌కు దూరంగా ఉంచిన 20 మంది అత్యున్న‌తాధికారులు కూడా కేసీఆర్ స‌ర్కారుకు అనుకూలంగా ప‌నిచేస్తున్న‌వారేన‌ని అందుకే వేటు ప‌డింద‌ని ప్ర‌తిప‌క్షాలు యాగీ చేసే అవకాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. మొత్తానికి ఈ ప్ర‌భావం నుంచి బీఆర్ ఎస్ ఎలా బ‌య‌ట ప‌డుతుందో చూడాలి.