వైసీపీ ఎమ్మెల్యేపై డిటోనేటర్…తప్పిన ముప్పు

వైసీపీ నేత, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శంకర్ నారాయణ పై హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. శంకర్ నారాయణ కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్ విసిరి దాడి చేసేందుకు ప్రయత్నించారు, అయితే, అది గురితప్పి పక్కనే ఉన్న పొలాల్లో పడడంతో ఎమ్మెల్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు శంకర్ నారాయణ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కాన్వాయ్ దిగి నడవడం ప్రారంభించిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తి ఎమ్మెల్యే కాన్వాయ్ పై డిటోనేటర్ విసిరాడు. అయితే, గురి తప్పడంతో ఆ డిటోనేటర్ పక్కనే ఉన్న పొలాల్లో పడిపోయింది. పవర్ సప్లై లేకపోవడంతో అది పేలలేదని భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ గుర్తు తెలియని దుండగుడిని వైసీపీ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

నిందితుడు గుడిపల్లి వాసి గణేష్ గా గుర్తించామని, మద్యం మత్తులో డిటోనేటర్ విసిరినట్లు భావిస్తున్నామని పోలీసులు అన్నారు. అయితే, ఇది ముమ్మాటికీ హత్యాయత్నమేనని ఈ ఘటనపై శంకర్ నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డిటోనేటర్ పేలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.