కలెక్టర్ మీటింగ్ పెడితే.. ఉద్యోగులు ఏం చేశారంటే?

ఇది కరోనా కాలం. ప్రభుత్వ సిబ్బంది అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సమయం. ఇలాంటి తరుణంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో ఓ అత్యవసర సమావేశం నిర్వహించారు.

దీనికి పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులు హాజరయ్యారు. ఐతే కలెక్టర్ సమావేశంలో సీరియస్‌గా మాట్లాడుతూ.. సిబ్బంది ఈ సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతూ సూచనలు ఇస్తుంటే.. ఉద్యోగులు మాత్రం అవేమీ పట్టనట్లు వాళ్ల పనిలో వాళ్లు మునిగిపోయారు.

ఓ ప్రముఖ టీవీ ఛానెల్ అక్కడ జరిగిన తతంగాన్నంతా వీడియో తీసింది. దీనిపై కథనం కూడా ప్రసారం చేసింది. ఆ వీడియోలో ఉద్యోగుల చేసిన పనులు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

సమావేశంలో ఎక్కువగా మహిళా ఉద్యోగులే పాల్గొనగా.. వాళ్లందరూ స్మార్ట్ ఫోన్లు ఆన్ చేసి ముందు పెట్టుకున్నారు. ఒకరు జబర్దస్త్ చూస్తే, ఇంకొకరు డ్యాన్స్ షో వీక్షించారు. స్పూఫ్ వీడియోలు చూసే వాళ్లు కొందరైతే.. సినిమాలు వీక్షించేవాళ్లు ఇంకొందరు. కొందరు పడుకుని నిద్రపోతే.. ఇంకొందరు పక్క వాళ్లతో ముచ్చట్లు పెట్టుకున్నారు.

ఒక మహిళ అయితే.. నోట్ బుక్ పెట్టుకుని కలెక్టరు చెప్పేదంతా రాసుకుంటున్నట్లు కలరింగ్ ఇచ్చింది. కానీ వాస్తవంగా ఆమె చేసిన పని వేరు. తన శ్రీవారికి ఆమె ఒక ప్రేమలేఖ రాస్తూ కూర్చుంది. ఇలాంటి విచిత్ర విన్యాసాలు ఎన్నో కనిపించాయి ఆ సమావేశంలో. మొత్తం మీటింగ్ అయ్యాక మీడియా వాళ్లు అసలీ సమావేశం ఉద్దేశమేంటి.. కలెక్టరు ఏం చెప్పారో చెప్పండి అని అడిగితే.. నీళ్లు నమిలారు ఉద్యోగులు.

ఏమో తెలియదని కొందరు.. జరిగిందానికి పొంతన లేని మాటలు చెప్పి కొందరు.. మమ్మల్నెందుకు అడుగుతారు వాళ్లనడగండి అంటూ వేరే వాళ్ల వైపు మళ్లిస్తూ మరికొందరు.. ఇలా సాగింది ఆ ఉద్యోగుల వ్యవహారం.