ఎన్నిక‌ల ఎఫెక్ట్: ఎన్టీఆర్‌పై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అస‌లే ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డం… సెటిల‌ర్ల ఓట్లు, అదేస‌మ‌యంలో టీడీపీ అభిమానుల ఓట్లు కూడా క‌ల‌వ‌ర పెడుతున్న నేప‌థ్యంలో తెలంగాణ మంత్రి, పొలిటిక‌ల్ హాట్ కామెంట్లు పేల్చే యువ నాయ‌కుడు కేటీఆర్ సీనియ‌ర్ ఎన్టీఆర్ సెంట్రిక్‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “మాకు రాముడైనా.. కృష్ణుడైనా సీనియ‌ర్ ఎన్టీఆర్ ఒక్క‌రే!!” అని కేటీఆర్ వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అంతేకాదు.. ప్ర‌పంచంలో తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా.. వారంద‌రి ఆరాధ్య దైవం ఎన్టీఆరేన‌ని కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్ల వ్య‌యంతో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహాన్ని ర‌వాణా శాఖ‌ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ.. సీనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు.

“విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు… ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు. అప్ప‌టి శ్రీరామ‌చంద్రుడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది కూడా ఎన్టీఆరేన‌ని చెప్పారు.

చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుందన్న కేటీఆర్ .. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం త‌న‌కు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. త‌న‌కు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తారక రామారావు పేరులోనే పవర్‌ ఉందని, ఎన్టీఆర్‌ శిష్యుడిగా కేసీఆర్‌ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారని పేర్కొన్నారు. మొత్తంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌లు.. ఎన్నిక‌ల నేప‌థ్యంలో అటు సెటిల‌ర్లు, ఇటు టీడీపీ అభిమానుల‌ను ఆక‌ర్షించేవిగా ఉన్నాయ‌నే గుసగుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.