జగన్ భుజంపై బీజేపీ తుపాకీ!

Raghuveera Reddy

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రంలోని బీజేపీ ఉందా? ఇప్పుడు రాజకీయాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. బీజేపీకి తెలియకుండా బాబు అరెస్టు జరిగే అవకాశమే లేదని కొన్ని పార్టీలు వాదిస్తున్నాయి. బాబు అరెస్టు అక్రమమని, దీనికి తమ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు బాబు అరెస్టు విషయంలో మాత్రం జగన్ వెనుక ఉన్నది బీజేపీనే అని ప్రచారం హోరెత్తుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండించడానికి, బీజేపీ పాత్ర లేదని చెప్పడానికి ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టు విషయం తెలియగానే ఆయన వదిన, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వెంటనే స్పందించారు. ఇది అక్రమమని గొంతెత్తారు. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కేంద్రంలోని బీజేపీ నుంచి ఆదేశాలు రావడంతోనే పురందేశ్వరి మౌనం పాటిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. టీడీపీతో నూ పొత్తు ప్రకటించింది. బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు పవన్ చెప్పారు. కానీ దీనిపై ఇప్పటివరకూ బీజేపీ స్పందించలేదు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం.. బాబు అరెస్టు వెనుక కేసీఆర్, జగన్, మోదీ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని రఘువీరా రెడ్డి ఆరోపించారు. జగన్ భుజంపై బీజేపీ తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియకుండా బాబు అరెస్టు జరగదన్నారు. ఏపీలో బీజేపీ బలపడాలనుకోవడం దీని వెనుక దాగి ఉన్న కారణమని చెప్పారు. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ ఎన్ని నిరసనలు, ఉద్యమాలు చేసిన ప్రయోజనం శూన్యమని రఘువీరా అన్నారు. బాబుపై కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి టీడీపీ కోర్టులోనే పోరాటం చేయాలని ఆయన సూచించారు.