తిరుపతి అభ్యర్ధిని ఫైనల్ చేశారా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ తిరుపతి ఎంఎల్ఏ అభ్యర్ధిని ఫైనల్ చేసినట్లే ఉంది. భూమన అభినయరెడ్డి పోటీ చేయబోతున్నట్లు పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. తిరుపతి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో తిరుపతి ఎంఎల్ఏగా అభినయరెడ్డి పోటీచేస్తారని ప్రకటించారు. ఎంపీ తాజా ప్రకటనతో అభ్యర్ధి విషయంలో ఇంతకాలం జరిగిన ప్రచారానికి తెరపడినట్లయ్యింది.

ప్రస్తుతం తిరుపతి ఎంఎల్ఏగా భూమన కరుణాకరరెడ్డి ఉన్నారు. ఈయన్నే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు ఛైర్మన్ గా కూడా నియమించారు. 2019 లో గెలిచినపుడే కరుణాకరరెడ్డి అవే తన చివరి ఎన్నికలని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొడుకు అభినయ్ ని డిప్యుటి మేయర్ గా చేయించకుకున్నారు. అప్పటి నుండి అభినయే అనధికారిక ఎంఎల్ఏగా చెలామణి అవుతున్నారు.

తిరుపతి కార్పొరేషన్ మేయర్ గా డాక్టర్ శిరీష ఉన్నప్పటికీ తండ్రి, కొడుకులు ఆమెను డమ్మీని చేసేశారు. అంటే డిప్యూటీ మేయర్ అభినయే అటు ఎంఎల్ఏగా ఇటు మేయర్ గా అనధికారిక అధికారాలను చెలాయిస్తున్నారు. తిరుపతిలో జరిగే ఏ కార్యక్రమం అయినా అభినయ్ లేకుండా జరగటంలేదు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తిరుపతిలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినయే పర్యవేక్షిస్తున్నారు. పార్టీతో పాటు అధికార యంత్రాంగం మొత్తం అభినయ్ చుట్టే తిరుగుతోంది.

ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తిరుపతి నుండి బీసీ అభ్యర్థిని ఎంఎల్ఏగా పోటీచేయించాలని జగన్ అనుకున్నారనే ప్రచారం పెరిగిపోయింది. మేయర్ శిరీష్ ఎలాగూ బీసీనే కాబట్టి అందులోను ఆమె డాక్టర్ కూడా కావటంతో ఆమే కాబోయే ఎంఎల్ఏ అభ్యర్ధనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఎంఎల్ఏ అభ్యర్ధి విషయంలో క్లారిటి ఇవ్వాలని జగన్ను అడిగినట్లున్నారు. తన కొడుక్కే టికెట్ కావాలని పట్టుబట్టినట్లున్నారు. చివరకు ఏమనుకున్నారో ఏమో అభినయ్ నే పార్టీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి తిరుపతిలోనే ప్రకటించి సస్పెన్సుకు తెరదించారు.