కేసీయార్ లో టెన్షన్ పెరుగుతోందా ?

రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేలు నియోజకవర్గాల్లో కేసీయార్ పోటీచేయబోతున్నారు. అయితే ఇంతకాలం గజ్వేలులో గెలిచినంత తేలికకాదు రేపటి ఎన్నికల్లో కామారెడ్డిలో గెలవటం. దానికి కారణాలు ఏమిటంటే రెండున్నాయి. ఇప్పటికే కేసీయార్ ప్రభుత్వంపై జనాల్లో ఉన్న వ్యతిరేకతకు రెండు కారణాలు అదనంగా యాడ్ అవబోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కామారెడ్డి నియోజకవర్గంలో గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం అనేది ఒకటుంది. గల్ఫ్ బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని ఒకపుడు కేసీయార్ చాలా మాటలు చెప్పారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ బాధితులను కానీ వాళ్ళ కుటుంబాలను కానీ పట్టించుకోలేదు. గల్ప్ బాధితుల కుటుంబాల ఓట్లు నియోజకవర్గంలో సుమారు 30 వేలదాకా ఉన్నాయట. వాళ్ళంతా ఈమధ్యనే కేసీయార్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ నిర్వహించారు. బాధితుల కుటుంబాలకు చెందిన ఆడోళ్ళతో రాబోయే ఎన్నికల్లో నామినేషన్లు వేయించాలని డిసైడ్ చేశారు. తమను నిర్లక్ష్యంచేస్తున్న కారణంగా కేసీయార్ ఓటమికి కంకంణం కట్టుకోవాలని నేతలు పిలుపిచ్చారు.

ఇది సరిపోదన్నట్లుగా తాజాగా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ధర్మపోరాటం పేరుతో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ కూడా కేసీయార్ కు వ్యతిరేకంగానే జరిగింది. రాబోయే ఎన్నికల్లో కేసీయార్ ఓటమికి గట్టిగా పనిచేయాలని నేతలు పిలుపిచ్చారు. కారణం ఏమిటంటే ముదిరాజు సామాజికవర్గాన్ని కేసీయార్ బాగా అవమానిస్తున్నట్లు వీళ్ళంతా మండిపోతున్నారు. తమ సామాజికర్గం జనాభా ప్రాతిపదికగా కనీసం నాలుగు ఎంఎల్ఏ టికెట్లు ఇవ్వాలని వీళ్ళు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు.

అయితే కేసీయార్ మాత్రం ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. గజ్వేలు, కామారెడ్డిలో చెరో 50 వేల ముదిరాజుల ఓట్లున్నట్లు అంచనా. అలాగే ఎల్లారెడ్డిలో 70 వేల ఓట్లున్నాయట. ముదిరాజుల సంఘం నేతలు చెప్పేప్రకారం రాష్ట్రమొత్తంమీద సుమారు 45 లక్షల ఓట్లున్నాయట. మరి నిజంగానే ఇన్నిలక్షల ఓట్లున్న సామాజికవర్గాన్ని కేసీయార్ ఎందుకు దూరం చేసుకుంటారన్నది పాయింట్. బీసీల్లో యాదవులు, గౌడ్లు, మున్నూరుకాపులు తర్వాత ముదిరాజులు కీలకమనే చెప్పాలి. మరి వీళ్ళంతా చివరకు ఏమిచేస్తారో చూడాలి.