కాంగ్రెస్ లో పెరుగుతున్న జోరు

తెలంగాణా ఎన్నికలు దగ్గరపడేకొద్ది కాంగ్రెస్ లో జోరు పెరిగిపోతోంది. ఇంతకీ ఆ జోరు ఏమిటంటే చేరికల జోరు. ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కుంభం విజయకుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కుంభం మొదటినుండి కాంగ్రెస్ లోనే ఉన్నారు. రెండునెలల క్రితమే బీఆర్ఎస్ లో చేరారు. అలాంటిది మళ్ళీ కారుపార్టీకి రాజీనామా చేసి మళ్ళీ హస్తంపార్టీలోకి వచ్చేశారు. నల్గొండ జిల్లా భువనగిరిలో కుంభంకు మంచిపట్టుందని అంటారు.

అలాగే బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు, కొడుకు రోహిత్ రావుతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ కు ఖానాపూర్ ఎంఎల్ఏ రేఖానాయక్ తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారు. బోధ్ ఎంఎల్ఏ బాపూరావు రాథోడ్, ఎంఎల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంఎల్ఏ వేముల వీరేశం తదితరులు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరారు. వీళ్ళంతా ఒకపుడు కాంగ్రెస్సే అయినా చాలాకాలం క్రితమే బీఆర్ఎస్ లో చేరి మళ్ళీ ఇపుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఇదే సమయంలో బీజేపీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, ఎన్నం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. తొందరలోనే ఎంఎల్సీ కూచకుళ్ళ దామోధరరెడ్డి పార్టీలో చేరటానికి రెడీ అవుతున్నారు. ఈయనే కాకుండా చాలామంది కమలనాదులు కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. బహుశా ఈనెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారంలో ఈ చేరికలు ఉంటాయని అనుకుంటున్నారు.

అంతాబాగానే ఉంది కానీ ఇంతమందిని చేర్చుకోవటం వల్ల కాంగ్రెస్ కు ఏమేర లాభమో అర్ధంకావటంలేదు. ఎందుకంటే చేరేవాళ్ళంతా రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశించే జాయిన్ అవుతారు. ఒకవేళ అది సాధ్యంకాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక కీలక పదవికి హామీ తీసుకునే జాయిన్ అవుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పదవులు ఇవ్వటం అంత తేలికకాదు. ఎందుకంటే మొదటినుండి పార్టీలోన ఉన్న నేతలతో పాటు కొత్తగా హామీలు తీసుకుని చేరబోతున్న నేతల్లో ఎంతమందికి పదవులను ఇస్తారు ? మరి పార్టీ ఏమి చేయబోతోందో చూడాల్సిందే.