కేసీయార్ సూపర్ ప్లాన్ ?

రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఒక్కో పార్టీది ఒక్కో వ్యూహం. తమ పార్టీ అభ్యర్థులను ఎలా గెలిపించుకోవాలా అని ఆలోచిస్తునే ఎదుటి పార్టీ అభ్యర్ధులను ఎలా దెబ్బకొట్టాలా అని కూడా ఏకకాలంలోనే ఆలోచించుకుంటున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఓటమికి కేసీయార్ చాల జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తరపున పోటీచేయటానికి అవకాశం రాని నేతలకు వల విసురుతున్నారట. ఎలాగూ టికెట్ వచ్చే అవకాశంలేదు కాబట్టి బీఆర్ఎస్ లోకి వచ్చేయమని ఆఫర్లు ఇస్తున్నారట.

కాంగ్రెస్ లో ఎవరెవరికి టికెట్లు దక్కే అవకాశాలు లేవు, అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరు అనే విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీయటానికి బీఆర్ఎస్ లోని కొందరు ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించారట. టికెట్లు దక్కే అవకాశాలు లేనివాళ్ళని, అసంతృప్త నేతలను గుర్తించి వాళ్ళను లైనులో పెట్టేందుకు ప్రత్యేకంగా కొందరు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీలో టాక్ మొదలైంది. ఇందులో కూడా సూపర్ స్కెచ్ ఏమిటంటే టికెట్లు దక్కనివాళ్ళని పోటీలో ఉండాలని ఎంకరేజ్ చేస్తున్నారట.

కాంగ్రెస్ రెబల్ గా పోటీచేస్తే అందుకు అవసరమైన ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తామని బీఆర్ఎస్ లోని కొందరు సీనియర్లు కాంగ్రెస్ అసంతృప్త నేతలకు ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. రెబల్స్ రంగంలో ఉంటే కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ అభ్యర్ధుల విజయం తేలికవుతుందని కేసీయార్ అంచనా. ఈ వ్యూహం వర్కవుటయ్యేందుకు ఎంత ఖర్చయినా పర్వాలేదన్న పద్దతిలో కేసీయార్ ఆలోచిస్తున్నారట. దీనివల్ల బీఆర్ఎస్ అభ్యర్దుల గెలుపు ఖాయమైనపుడు ఖర్చులకు వెనకాడకూడదన్నది కీలకమైన పాయింట్.

ఉన్న 119 నియోజకవర్గాలకు గాను సుమారు 1120 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 34 నియోజకవర్గాలకు కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. అంటే మిగిలిన నియోజకవర్గాలకు ఆశావాహులను వివిధ కోణాల్లో ఆలోచించి ప్రదేశ్ ఎన్నికల కమిటి తర్వాత స్క్రీనింగ్ కమిటి తప్పించేసింది. ఏదేమైనా టికెట్లు దక్కని నేతల్లో కనీసం ఓ 50 మందైనా గట్టి నేతలే ఉంటారని కేసీయార్ అంచనా వేస్తున్నారు. వీళ్ళల్లో కొందరు తన గేలానికి దొరికినా చాలు కాంగ్రెస్ అభ్యర్ధుల ఓటమి ఖాయమనే అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.