జగన్ కు ఇది లాభమా.. నష్టమా..?

పెన్షన్ విధానంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఫైనల్ చేసేసింది. కొత్తగా రూపొందించిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)మాత్రమే అమలు చేయబోతున్నట్లు మంత్రి బొత్సా సత్యనారాయణ ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టంగా చెప్పేశారు. అయితే ఉద్యోగులేమో తమకు జీపీఎస్ వద్దని ఓపీఎస్సే కావాలని పట్టుబడుతున్నారు. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ ఓపీఎస్ ను యూపీఏ ప్రభుత్వం అమల్లోకి రాగానే అంటే 2004లోనే రద్దుచేసింది. 2004కి ముందు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఓపీఎస్ వర్తిస్తుంది.

2004 తర్వాత ఉద్యోగంలో చేరి రిటైర్ అయిన వాళ్ళెవరికీ ఓపీఎస్ వర్తించదు. అయితే ఏ పద్దతిలో పెన్షన్ ఇవ్వాలనే విషయాన్ని అప్పట్లో కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు వదిలిపెట్టేసింది. ఇపుడు సమస్య ఏమైందంటే కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఓపీఎస్ ను అమలు చేస్తామని చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తెచ్చాయి. అయితే దీనివల్ల సమస్య ఏమిటంటే ముందుముందు ఖజానాపై ఆర్ధికభారం చాలా ఎక్కువైపోతుంది.

ఈ విషయం తెలియటంతోనే చంద్రబాబునాయుడు ఉద్యోగులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సీపీఎస్ అంటే కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అమల్లో ఉండేది. అయితే 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దుచేస్తానని హామీ ఇచ్చేశారు. దీనివల్ల ఉద్యోగుల ఓట్లు పడితే పడుండచ్చుకానీ తన హామీని మాత్రం నిలుపుకోలేకపోయారు. ఉద్యోగులకు తప్పుడు హామీ ఇచ్చినట్లయ్యింది. దాదాపు నాలుగేళ్ళు సీపీఎస్సే అమల్లో ఉండి ఇపుడు రద్దయ్యింది. దీనిస్ధానంలో జీపీఎస్ ను తీసుకొచ్చారు. దీన్నే ఇపుడు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీపీఎస్ ను కేంద్రం కూడా అభినందించింది. అయితే ఇక్కడ ఆమోదించాల్సింది ఉద్యోగులు మాత్రమే. మరి వీళ్ళంతా ఇపుడు ప్రభుత్వంపై మండిపోతున్నారు. దాంతో రాబోయే ఎన్నికల్లో పెన్షన్ అన్న అంశం వైసీపీపై ఏ మేరకు ప్రభావం పడుతుందో చూడాలి. ఎందుకంటే ఇపుడున్న ఉద్యోగులందరికీ జీపీఎస్ వర్తించదు. అంటే పెన్షన్ విధానంపైన ఉద్యోగుల్లోనే విభేదాలున్నాయి. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు ఎంతమంది అన్న లెక్కలు తేలితే ప్రభుత్వంపై పదే ప్రభావం లెక్కతేలుతుంది.