అసెంబ్లీలో ఈల వేసి గోల చేసిన బాలకృష్ణ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా వాడీవేడిగా సాగుతున్నాయి. మొదటి రోజు సభలో బాలకృష్ణ మీసం మెలేసి తొడ కొట్టడం… అంబటి రాంబాబుకు సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో రోజు సభలో కూడా టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సభలో చంద్రబాబు సీటు పైకెక్కిన బాలకృష్ణ విజిల్ ఊదుతూ తన నిరసన వ్యక్తం చేయడం సంచలనం రేపింది.

చంద్రబాబు అరెస్టు తర్వాత మునుపెన్నడూ లేని విధంగా రాజకీయంగా బాలయ్య యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. అదే ఊపును అసెంబ్లీలో సైతం కొనసాగిస్తున్నారు. దూకుడుగా వ్యవహరిస్తూ అధికార పార్టీ సభ్యులకు జవాబిస్తున్నారు. ఇక, రెండో రోజు కూడా చంద్రబాబు అరెస్టుపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా తమ్మినేని దానిని తిరస్కరించారు. ఈ క్రమంలోనే పోడియాన్ని చుట్టుముట్టిన టిడిపి సభ్యులు ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే స్పీకర్ 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. అయితే, సభ పున:ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సందర్భంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సైకో పాలన పోవాలి…చంద్రబాబును విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో, టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వారు వినకుండా నినాదాలు చేయడంతో టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ లను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు.