చంద్ర‌బాబు దొంగ‌గా దొరికారు:  జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Y S Jagan

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబును దొరికిన దొంగ‌గా ఆయ‌న పేర్కొన్నారు. అయితే, దొంగ‌గా దొరికిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు ఉన్న బ‌ల‌మైన ముఠా ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక పోతోంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టి న‌కిలీ ఒప్పందంతో ప్ర‌జాధ‌నాన్ని దోచుకున్నార‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలు ప్రాంతంలో నిర్వ‌హించిన వైఎస్సార్ కాపు నేస్తం నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు అరెస్టు, జైలు అంశాల‌ను ప్ర‌స్తావించారు. తొలుత చంద్ర‌బాబు పీఏ అడ్డంగా దొరికి పోయార‌ని అన్నారు. ఆయ‌న నుంచి కూపీలాగ‌గా చంద్ర‌బాబు అక్ర‌మం బ‌య‌ట ప‌డింద‌ని చెప్పారు. కోర్టుల్లో 10 గంట‌ల పాటు వాద‌న‌లు జ‌రిగాయ‌ని, అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ముఠాకు చంద్ర‌బాబులో త‌ప్పు క‌నిపించ‌డం లేద‌ని పేర్కొన్నారు. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన త‌ర్వాత అవి నిజ‌మేన‌ని న‌మ్మిన త‌ర్వాతే.. చంద్ర‌బాబును జైలుకు పంపించిన‌ట్టు తెలిపారు.

ఎన్ని దోపిడీలు చేసినా ఎన్ని వెన్ను పోట్లు పొడిచినా.. చంద్ర‌బాబును ర‌క్షించే వారు ర‌క్షిస్తూనే ఉన్నార‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. “లంచాలు తీసుకుంటే త‌ప్పేంట‌ని ఒక‌రు ప్ర‌శ్నిస్తారు. ఒత్తిడి తెచ్చి మ‌రీ సంత‌కాలు చేయించినా త‌ప్పు కాద‌ని పేర్కొంటారు“ అని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ములాఖ‌త్ ద్వారా మిలాఖ‌త్ అయి.. కొంద‌రు పొత్తు రాజ‌కీయాల‌కు తెర‌దీశారంటూ ప‌రోక్షంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో ముందుగా ప్ర‌భుత్వ సొమ్ము ఇవ్వొద్ద‌ని అధికారులు చెప్పినా విన‌కుండా బ‌ల‌వంతంగా చంద్ర‌బాబు ఒత్తిడితోనే ప్ర‌జాధ‌నం దోచుకున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌లంతా ఈ విష‌యంలో ఆలోచ‌న చేయాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు. వంద‌ల కోట్ల ప్ర‌జాధ‌నం ఎటు పోయిందో.. ఎవ‌రి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచ‌న చేయాల‌ని అన్నారు.