మోడీ ఎదుర్కోలేని స్కెచ్‌తో వ‌స్తున్న కేసీఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాధ్యంలోని బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా పావులు క‌దిపి ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌… కొద్దికాలంగా జాతీయ రాజకీయాల విష‌యంలో స్త‌బ్దుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమితో, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూట‌మి రాబోయే ఎన్నిక‌ల‌కు దూకుడుగా ముందుకు సాగుతుండ కేసీఆర్ ప్ర‌తిపాదించిన ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల ఎజెండా మాత్రం అస‌లు క్రియాశీల‌గా లేదు. అయితే, పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్రధానంగా అధికార పార్టీ ర‌థ‌సార‌థి మోడీని, ప్రతిపక్ష ఇండియా కూటమి టార్గెట్ గా కేసీఆర్ కొత్త వ్యూహంతో ఎంట్రీ ఇచ్చారు.

పార్లమెంట్ ప్ర‌త్యేక సమావేశాల సందర్భంగా బీసీలకు రిజర్వేషన్లు మహిళలకు రిజర్వేషన్లు అనే అంశాన్ని తాజాగా కేసీఆర్ ఎత్తుకున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన తమ నిర్ణ‌యాల‌ను వెల్ల‌డిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుతో సహా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును.. రెండింటినీ ఈనెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని., శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమైన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన,శుక్రవారం నాడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా… బీసీ (ఓబీసీ) బిల్లు & మహిళా బిల్లు., ఈ రెండు బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ఎస్ ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాల పై పార్లమెంటరీ పార్టీ సుధీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి వున్నదని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ తన గళాన్ని వినపిస్తునే వుంటుందని స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లను రాజ్యసభ లోక్ సభల్లో ఎంపీలు లేవనెత్తాలని అధినేత సిఎం కేసీఆర్ సూచించారు. తమ గళాన్ని వినిపించాలని దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు, అసెంబ్లీ చట్ట సభల్లో బీసీలకు సరియైన ప్రాధాన్యత దక్కినప్పుడే వారి సమ్మితాభివృద్ధి సాధ్యమౌతుందని పునరుద్ఘాటించింది. ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

మహిళాభ్యున్నతి పట్ల చిత్తశుద్దిని ప్రదర్శిస్తూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రధాని నరేంద్ర మోడీకి మహిళా రిజర్వేషన్ల పై లేఖ రాశారు.