చంద్ర‌బాబుతో ప‌వ‌న్ ములాఖ‌త్‌… మ‌రింత బ‌ల‌ప‌డ‌నున్న బంధం!

“చంద్ర‌బాబుకు అండ‌గా ఉంటా”-అంటూ కొన్ని రోజుల కింద‌ట చేసిన వ్యాఖ్య‌ల మేర‌కు జ‌న‌సేన అధినే త ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో విచార‌ణ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. గ‌తంలో విశాఖ‌లో త‌న‌ను పోలీసులు నిలువ‌రించిన‌ప్పుడు చంద్ర‌బాబు త‌న‌కు అండ‌గా నిలిచార‌ని ప‌దే ప‌దే చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ క్ర‌మంలో క‌ష్ట కాలంలో చంద్ర‌బాబుకు తాను కూడా అండ‌గా నిల‌వాల్సిన ధ‌ర్మం ఉంద‌ని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

రాజ‌మండ్రి జైల్లో ఉన్న చంద్ర‌బాబుతో ప‌వ‌న్ ములాఖ‌త్ కావ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. 2019 ఎన్నిక‌ల్లో ఎవ‌రికి వారుగా పోటీ చేసినప్ప‌టికీ.. రాష్ట్రంలో వైసీపీ స‌ర్కారును గ‌ద్దె దింపాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించిన ద‌రిమిలా.. ఇరు పార్టీలకూ ప్ర‌స్తుత ములాఖ‌త్ ఒక ఆక్సిజ‌న్ వంటిద‌నే చెప్పాలి. చంద్ర‌బాబుతో భేటీ ద్వారా టీడీపీకి సైతం తాను అండ‌గా ఉన్నాన‌నే సంకేతాలు ప‌వ‌న్ పంపించిన‌ట్టు అయింది.

అదేస‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌తో చ‌ర్చించ‌డం ద్వారా ఈ రెండు పార్టీలు వేర్వేరు అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జాక్షేత్రం విష‌యానికి వ‌చ్చేస‌రికి, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల అంశాల‌కు వ‌చ్చేస‌రికి చేతులు క‌లుపుతుండ‌డం ప్ర‌జ‌ల్లోకి పాజిటివ్ సంకేతాలు పంపిస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదేస‌మ‌యంలో కీల‌క‌మైన కాపు ఓటు బ్యాంకు విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒకింత సందిగ్ధ‌త ఏర్ప‌డింది. ప‌వ‌న్ టీడీపీతో చేతులు క‌ల‌ప‌డాన్ని కాపు సామాజిక వ‌ర్గంలోని ఓ వ‌ర్గం వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే, టీడీపీ అధినేత అక్ర‌మ అరెస్టును వారు సైతం త‌ప్పుబ‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో అనూహ్యం గా ప‌వ‌న్ చంద్ర‌బాబుతో ములాఖ‌త్ కావ‌డాన్ని వారు సైతం స్వాగ‌తిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు, సీట్ల విష‌యాన్ని ప‌క్కన పెడితే.. కీల‌క‌మైన రెండు పార్టీల అధినేతలు కూడా క‌ష్ట కాలంలో హ‌క్కుల కోసం, ప్ర‌జాస్వామ్యం కోసం క‌లిసి ప‌నిచేసేందుకు ముందుకు రావ‌డం, ప్ర‌త్యేక భేటీలు నిర్వ‌హించ‌డం వంటివి కాపు సామాజిక వ‌ర్గంలోనూ ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామంగానే ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌-చంద్ర‌బాబుల రాజ‌కీయం ఒక ఎత్త‌యితే.. ఇప్ప‌టి నుంచి మ‌రో విధంగా ఉంటుంద‌ని, క్షేత్ర‌స్థాయిలో టీడీపీ, జ‌న‌సేన పార్టీలు మ‌రింత బ‌లోపేతం అయ్యేందుకు, ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య ఉన్న స్వ‌ల్ప విభేదాలు, రాజ‌కీయ దూరాల‌కు ఈ ములాఖ‌త్ చెక్ పెడుతుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నందున అధినేత‌ల ములాఖ‌త్ అనంత‌రం ఇప్పటి నుంచి ఇరు పార్టీలు కూడా మ‌రింత అవ‌గాహ‌న‌తో ముందుకు సాగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామం.. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వైసీపీకి భారీ దెబ్బ‌గా మారుతుంద‌ని మ‌రికొంద‌రు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.