చంద్రబాబుతో పవన్ ములాఖత్..హై అలర్ట్

రాజమండ్రికి పవన్..చంద్రబాబుతో ములాఖత్టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్ పై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ లకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. దీంతో, మరికొద్ది రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి జైల్లో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నారు. చంద్రబాబుతో పవన్ ములాఖాత్ కాబోతున్నారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.

చంద్రబాబుకు మద్దతునిచ్చి ధైర్యం చెప్పేందుకే పవన్ వెళ్తున్నారని తెలుస్తోంది. రోడ్డు మార్గంలో కాకుండా ప్రత్యేక విమానంలో పవన్ రాజమండ్రికి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరగబోతోంది అన్న విషయంపై సర్వత్రా0 ఆసక్తి ఏర్పడింది. చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రేపు పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేయబోతున్నారు. చంద్రబాబుతో ఇప్పటికే భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి దాదాపు 40 నిమిషాలపాటు నిన్న ములాఖత్ అయిన సంగతి తెలిసిందే. ఇక, ఈరోజు సాయంత్రం 4 గంటలకు జైల్లో చంద్రబాబుతో అయన తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా భేటీ కాబోతున్నారు.

అంతకుముందు, చంద్రబాబు అరెస్టయిన రోజు మంగళగిరిలో జనసేన ఆఫీసుకు వెళ్లేందుకు పవన్ ప్రయత్నించగా ఆయనను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. బేగంపేట విమానాశ్రయంలో పవన్ విమానానికి అనుమతి నిరాకరించగా..రోడ్డు మార్గంలో కూడా ఆయనను అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని పవన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జైలు అధికారులు పవన్ కు అనుమతినివ్వడం విశేషం.