కొత్త పాయింట్ పట్టిన కేటీఆర్!

తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించాలన్నదే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ లక్ష్యం. అందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్ర కసరత్తుల్లో మునిగిపోయారు. ఇక పార్టీలో కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావు కూడా పార్టీ విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోసారి తెలంగాణ వాదాన్ని తెరమీదకు తెస్తూనే.. కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి వెనుక కేవీపీ రామచంద్రరావు, కిషన్ రెడ్డి వెనుక కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ కొత్త పాయింట్ తీసుకొచ్చారనే చర్చ జోరందుకుంది.

రాష్ట్రంలో గత రెండు ఎన్నికల సమయంలోనూ తెలంగాణ వాదాన్ని బీఆర్ఎస్ ఎత్తుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, ఏపీ నాయకుల వైఖరిని గుర్తు చేస్తూ, విమర్శిస్తూ బీఆర్ఎస్ ఓట్లు అడిగి గెలిచింది. ఇప్పుడు రాబోయే మూడో ఎన్నికల్లోనూ పార్టీ అదే వైఖరి అవలంబించేలా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో సహా కొంతమంది మంత్రులు ఏపీపై రెచ్చిపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా కేటీఆర్ మరో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిపై కొత్త ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

మళ్లీ ఢిల్లీ గులాములు కావాలా? సొంత ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా? అనేది ఇప్పుడు ప్రజల ముందు ఉన్న ప్రశ్న అని కేటీఆర్ అన్నారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని చీల్చి, తమ పార్టీ ఎమ్మెల్యేలను కొన్న కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు ఇక్కడివాడినే అంటున్నారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు మాట మారస్తున్నారన్నారు. మరోవైపు తెలంగాణకు బద్ధ శత్రువైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీకి మార్గనిర్దేశనం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పైకి కనిపించేది మాత్రమే రేవంత్, కిషన్ అని.. వీళ్లను నడిపించేది, ఆడించేది ఢిల్లీ దూతలు కేవీపీ, కిరణ్ కుమార్ అని కేటీఆర్ ఆరోపించారు. అలాగే తెలంగాణ వ్యతిరేకి షర్మిల కూడా ఇప్పుడు తెలంగాణ వాదిననే అంటున్నారని కేటీఆర్ చెప్పారు. మరి కేటీఆర్ ఆరోపణలపై కాంగ్రెస్, బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.