ముస్లింల ఓట్లు ఎటువైపు ?

ఇపుడిదే కాస్త సస్పెన్సుగా మారింది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో చాలా సామాజికవర్గాల ఓట్లు ఎంతో కీలకంగా మారబోతున్నాయి. ఇందులో భాగంగానే ముస్లిం మైనారిటీల ఓట్లు కూడా కీలకపాత్ర పోషించబోతోంది. ఒక అంచనా ప్రకారం తెలంగాణాలో ముస్లింల ఓట్లు 40 నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 15 శాతం ఉన్నారు. వీళ్ళ ఓట్లకోసమే కేసీయార్ మైనారిటిలకు లక్ష రూపాయల సాయం అనే పథకాన్ని పట్టుకొచ్చారు.

అయితే పథకాన్ని అయితే ఆర్భాటంగా ప్రకటించారు కానీ అమలులోకి వచ్చేసరికి అంత సజావుగా సాగటంలేదు. దీంతో చాలామంది పేద ముస్లింల్లో మండుతోంది. హడావుడిగా రాబోయే ఎన్నికలకోసమే కేసీయార్ పథకాన్ని ప్రకటించారనే భావనలో ఉన్నారు. ఎందుకంటే ఆమధ్య జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలోనే దళితబంధు పథకాన్ని ప్రకటించారు. పథకాన్ని అయితే ప్రకటించారు కానీ సక్రమంగా అమలుకాలేదు. దాంతో మండిపోయిన దళితులు ఎలాంటి మొహమాటం లేకుండా ఈటల రాజేందర్ను గెలిపించారు.

దాంతో దళితబంధు పథకం రాష్ట్రంలో ఎక్కడ సక్రమంగా అమలవుతోందో ఎవరికీ తెలీదు. ఇపుడు మైనారిటి ఆర్ధికసాయం పథకం కూడా అంతేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణా ఏర్పడకముందు ముస్లింలు ఎక్కువగా కాంగ్రెస్ తోనే ఉన్నారు. ఓల్డ్ సిటిలో మెజారిటి ముస్లింలు ఎంఐఎంకు అండగా నిలుస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా తర్వాత ముస్లింల ఓటుబ్యాంకు బీఆర్ఎస్ కు ఫిష్టయ్యింది. అప్పటినుండి కాంగ్రెస్ ఇబ్బంది పడుతోంది.

అయితే రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసీయార్ మూడు టికెట్లను మాత్రమే ముస్లింలకు కేటాయించారు. ముస్లిం సంఘాల అంచనాల ప్రకారం బీఆర్ఎస్ కనీసం ఎనిమిది మందికి టికెట్లు ఇస్తుందని భావించారు. కానీ కేసీయార్ అలా చేయలేదు. దాంతో కాంగ్రెస్ ఏమి చేస్తుందనే విషయమై చర్చలు పెరిగిపోతున్నాయి. మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రత్యేకంగా చేసిన డిక్లరేషన్ తో ముస్లింల ఓట్లు తిరిగి కాంగ్రెస్ వైపు మళ్ళుతాయని సీనియర్లు ఆశిస్తున్నారు. మరి ముస్లింల ఓట్లు కాంగ్రెస్ ఇవ్వబోయే టికెట్ల పైనే ఆధారపడుందని అందరికీ తెలిసిందే. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.