ఎమ్మెల్యే అనుకుంటే.. అంతలోనే నిరాశ!

ఆ బీజేపీ మహిళా నాయకురాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే అనుకోని వరంలా హైకోర్టు తీర్పు వచ్చింది. ఆమెనే ఎమ్మెల్యే అని కోర్టు ప్రకటించింది. దీంతో ఎన్నికల లోపే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి.. పదవిలో ఉంటూ పోటీ చేయాలనుకున్నారు. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సుప్రీం కోర్టు స్టేతో ఆమె ఆశలపై నీళ్లు పడ్డాయి. ఆ నాయకురాలే.. డీకే అరుణ. సుప్రీం కోర్టు స్టేతో నిరాశలో ఆమె మునిగిపోయారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ తరపున డీకే అరుణ పోటీ చేశారు. కానీ అప్పటి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అభ్యర్థి క్రిష్ణమోహన్ రెడ్డి చేతిలో 28 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఎన్నికల అఫిడవిట్లో క్రిష్ణమోహన్ తప్పుడు సమాచారం ఇచ్చారని డీకే అరుణ ఫిర్యాదు చేశారు. ఆస్తుల సమాచారాన్ని దాచి పెట్టారని అరుణ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల క్రిష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించాలని ఆదేశించింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో డీకే అరుణ వెంటనే రంగంలోకి దిగారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె.. తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. అంతే కాకుండా హైకోర్టు తీర్పును అసెంబ్లీ కార్యదర్శి అమలు చేయడం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఉత్తర్వులు తీసుకుని మళ్లీ అసెంబ్లీకి వెళ్లారు. ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలనే పట్టుదల ప్రదర్శించారు. కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో డీకే అరుణకు నిరాశ ఎదురైంది. ఇప్పుడు సుప్రీం కోర్టులో విచారణ జరిగి, తీర్పు వచ్చే లోగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసే ఆస్కారముంది. అందుకే డీకే అరుణ ఆశ నెరవేరుతుందనే పరిస్థితులు లేవనే చెప్పాలి.