చంద్రబాబు అరెస్ట్.. పక్కా టైమింగ్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, ఆ స్కామ్ పై కేసు నమోదైన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేశారు అన్నది మరింత సంచలనంగా మారింది. అందులోనూ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ పేరు చంద్రబాబుదని, 1-36 నిందితులను అరెస్టు చేయకుండా చంద్రబాబును అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అంత అల్లాటప్పాగా చంద్రబాబును అరెస్ట్ చేయలేదని, పక్కా టైమింగ్ ప్రకారమే అరెస్టు చేశారని టాక్ వస్తోంది.

జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు ఉన్న చంద్రబాబును అరెస్టు చేస్తే జగన్ ప్రభుత్వానికి జాతీయ మీడియాలో కూడా తీవ్ర డ్యామేజీ జరుగుతుందని, అందుకే, జీ20 వంటి ప్రతిష్టాత్మక సదస్సు కవరేజీలో జాతీయ మీడియా బిజీగా ఉన్న టైం చూసి జగన్ దెబ్బకొట్టారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్బంగా.మీడియా ఫోకస్ మిగతా రాష్ట్రాల రాజకీయాలపై విస్తృతంగా ఉండదని, అందులోనూ, శనివారం..ఆదివారం కోర్టు సెలవులు చూసి మరీ అరెస్ట్ చేశారని తెలుస్తోంది. పక్కా ప్లాన్ తోనే సీఆర్ పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చి 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలుస్తోంది. చంద్రబాబుపై 120(బి),166,167, 418, 420, 465, 468, 201,109, రెడ్ విత్ 34 మరియు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ రాకుండా చేశారని తెలుస్తోంది.

1-36వ నిందితులను అరెస్టు చేయకుండా..37వ నిందితుడైన చంద్రబాబును అరెస్టు చేయడం కుట్రపూరితమేనని విమర్శలు వస్తున్నాయి. తాను లండన్ లో ఉన్నానని, అరెస్టు సమయంలో ఏపీలో లేను అని జగన్ చెప్పుకోవడం కోసం జగన్ లండన్ టూర్ టైంలో అరెస్టు జరిగిందని టాక్ వస్తోంది. ఇపుడైతే జీ20లో బిజీగా ఉన్న మోడీతోపాటు కేంద్ర పెద్దలు దీనిపై స్పందించేందుకు అందుబాటులో ఉండరని, ఈ సందర్భాన్ని జగన్ క్యాష్ చేసుకున్నారని తెలుస్తోంది. 2021లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే…2023లో అరెస్టు చేయడం…పక్కా వ్యూహం ప్రకారమే జరిగిందని , నాలుగేళ్లుగా అదును కోసం చూస్తున్న జగన్..ఇపుడు అవకాశం రాగానే అరెస్టు చేయించారని తెలుస్తోంది.