ఆ ముడుపులు చంద్రబాబు తీసుకున్నట్లు కాదు: కేశినేని నాని

టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని… టీడీపీతో చాలాకాలంగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేందుకే టిడిపి అధిష్టానం మొగ్గుచూపిందని, ఆ క్రమంలోనే నాని అలకబూని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా నాని కనిపించలేదు. తనకు టీడీపీ తరఫున టికెట్ ఇవ్వకుంటే రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా తాను టీడీపీలోనే ఉన్నానని నాని సంచలన ప్రకటన చేశారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫునే తాను పోటీ చేయబోతున్నానని నాని ప్రకటించారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబుపై నాని ప్రశంసలు కురిపించారు. దేశ రాజకీయాలలో నిజాయితీగల అతి కొద్ది మంది నేతలలో చంద్రబాబు ఒకరని, అవినీతి మచ్చలేని నాయకుడు అని నాని ప్రశంసించారు. ఇటీవల చంద్రబాబుకు ఐటి నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై కూడా నాని స్పందించారు. అది పెద్ద విషయం కాదని, దానికి ఆయన వివరణ ఇస్తారని చెప్పుకొచ్చారు. ఎంపీ గానే టిడిపి తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని నాని స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో కొందరు నేతలు 40 ఏళ్లుగా టిడిపిని నమ్ముకుని ఉన్నారని, వారిని రాజకీయంగా ఎదగకుండా కొందరు వాడుకుని వదిలేశారని అన్నారు.

రాజకీయాల్లో ప్రజాసేవ ముఖ్యమని పదవులు వాటంతటవే వస్తాయని నాని చెప్పారు. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పుకునే నిబద్ధత, కమిట్మెంట్ చంద్రబాబు దగ్గర ఉన్నాయని అన్నారు. నోటీసులు రాజకీయాల్లో చాలా రొటీన్ విషయమని, చంద్రబాబు తాలూకా X కి Yకి ఇచ్చినట్లు రాసుకొని ఉండొచ్చని, అంతమాత్రాన చంద్రబాబుకు ముట్టినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాజాగా నాని కామెంట్లు చూస్తుంటే టీడీపీ అధిష్టానంతో వచ్చిన అభిప్రాయభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తోంది.