కలకలం… 140 కోట్ల మందిపై ‘డ్రాగన్’ నిఘా?

అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ హస్తం అందిస్తూనే… ఆయా దేశాల కీలక సమాచారాన్ని రహస్యంగా పట్టి బంధిస్తోంది. ఇతర దేశాలకు సంబంధించిన సమాచారంపై నిఘా వేయడమే నేరమంటే… ఆ విషయాన్ని అంతగా పట్టించుకోని చైనా చాలా దేశాలకు చెందిన పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరిస్తోంది. అంతటితోనే ఆగకుండా… ఆయా దేశాలకు చెందిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఎక్కడికెళుతున్నారు? వంటి వాటిపైనా నిఘా పెడుతోంది. ఇదేదో చైనా అంటే గిట్టని దేశాలు చెబుతున్న మాట కాదు. అగ్రరాజ్యం అమెరికా సహా పలు స్వతంత్ర సంస్థలు, వ్యక్తులు ఈ విషయాన్ని నిర్ధారించేశారు. ఇలా చైనా నిఘా నేత్రానికి చిక్కిన వారి సంఖ్య ఏకంగా 140 కోట్లు దాటేసిందన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి.

తన సొంత దేశ పౌరులపైనా నిఘా పెట్టడం ఆయా దేశాలకు సరికాదు. అలాంటిది చైనా… తన పౌరులతో పాటు విదేశాలకు చెందిన దాదాపుగా 140 కోట్ల మంది ప్రజలపై నిరంతరం నిఘా పెట్టేస్తోంది. తన దేశానికి చెందిన పౌరులపై ఎప్పటి నుంచో నిఘాను కొనసాగిస్తున్న చైనా… తాజాగా ఇతర దేశాలకు చెందిన వ్యక్తుల మీదా నిఘా పెడుతున్నట్లు తాజాగా తేలింది. ఈ జాబితాలో భారత్ తో పాటుగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, తైవాన్, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయేల్, సూటాన్, పాకిస్థాన్, మోరాకో దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పౌరులు చైనాను సందర్శించిన సందర్భంగా వారి వివరాలను పట్టేసిన చైనా నిఘా వర్గాలు… ఆ తర్వాత ఆయా దేశాల వారు తిరిగి తమ దేశాలకు వెళ్లిన తర్వాత కూడా ఈ నిఘాను కొనసాగిస్తోందట. 

సొంత పౌరులపై వారికి తెలియకుండా నిఘా పెట్టడమే చట్టరీత్యా నేరం అంటే… మరి చైనా చేస్తున్న పని ఏ స్థాయి నేరమో ఇట్టే చెప్పేయొచ్చు. ఇలా చైనా నిఘా నేత్రాలకు చిక్కిన విదేశీయుల్లో మెజారిటీ ప్రజలు చైనాలోని జాంగ్ జియాకోవు ప్రాంతాన్ని సందర్శించిన వారే ఉండటం గమనార్హం. తమ దేశ పర్యటనకు వస్తున్న వారి వివరాలను వివిధ మార్గాల్లో పట్టేస్తున్న చైనా… ఆ తర్వాత వారిపై నిత్యం నిఘా కొనసాగిస్తోంది. ఇక చైనా పౌరులను వివాహం చేసుకున్న ఇతర దేశస్తులపైనా ఆ దేశం నిఘా ప్రత్యేకంగా కొనసాగుతోందట. ఏ కారణం చేత ఈ నిఘాను కొనసాగిస్తోందన్న విషయం తెలియకున్నా… చైనా చేస్తున్నది తప్పే కదా.

ఇప్పటికే చైనాపై ఈ దిశగా పెద్దఎత్తున ఆరోపణలు రాగా… ఇప్పుడు ఆధారాలతో సహా ఈ విషయం బయటపడిపోయింది. చైనా చేస్తున్న ఈ గూడచర్యం గురించి అమెరికా మీడియాలో భారీ స్థాయిలో కథనాలు వచ్చాయి. విదేశాలకు చెందిన 140 కోట్ల మందిపై చైనా ఎందుకు నిఘా పెడుతుందో అర్థం కావడం లేదని ఆ కథనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయినా ఈ విషయం ఎలా బయటపడిందన్నవిషయానికి వస్తే…  సైబర్ సెక్యూరిటి పరిశోధకుడు మార్క్ హోపర్ చైనా నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తోందన్న విషయాన్ని పరిశీలించగా ఈ దారుణం వెల్లడైంది. గతంలో తాను  డైనమిక్ కంట్రోల్ ఫ్లాట్ ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్ అనే వెబ్ సైట్ లో తన పేరుతో పాటు తన వ్యక్తిగత వివరాలు పూర్తిగా ఉండటం చూసి ఆయన ఆశ్యర్యానికి గురయ్యారు. ఆ క్రమంలోనే మరింత లోతుగా పరిశీలించగా… 140 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను సేకరించడంతో పాటుగా వారిపై నిత్యం నిఘా పెట్టిందని హోపర్ తేల్చేశారు.