హోం గార్డు క‌న్నుమూత‌… ఈ చావుకు బాధ్యులెవ‌రు?

తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్కారుకు హోం గార్డు రవీందర్ మృతి కేసు సెగ భారీగా త‌గులుతోంది. జీతాలు స‌రిగా ఇవ్వ‌డం లేద‌ని, ఉన్న‌తాదికారులు త‌మ‌ను వేధిస్తున్నార‌ని ఆరోపిస్తూ.. నాలుగు రోజుల కింద‌ట ఘోషామ‌హ‌ల్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న 38 ఏళ్ల ర‌వీంద‌ర్ తాజాగా శుక్ర‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్ర వ్యాప్తంగా హోం గార్డుల్లో తీవ్ర అల‌జ‌డి చోటు చేసుకుంది.

ఇప్ప‌టికే ర‌వీంద‌ర్‌కు మ‌ద్ద‌తుగా హోం గార్డుల సంఘం ధ‌ర్నాకు పిలుపునిచ్చింది. అయితే, ఉన్న‌తాధికా రులు ఈ ధ‌ర్నాకు అనుమ‌తి లేద‌న‌డంతో కొంత వెన‌క్కి త‌గ్గారు. ఇక‌, ఇప్పుడు ర‌వీంద‌ర్ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా హోం గార్డుల్లో ఆవేద‌న క‌ట్ట‌లు తెగుతోంది. వారంతా హైద‌రాబాద్‌కు చేరుకుని ర‌వీంద‌ర్ భౌతిక కాయాన్ని సంద‌ర్శించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. అయితే.. కేసీఆర్ స‌ర్కారు ఇక్క‌డ కూడా నిర్బంధం విధించింది.

రాష్ట్ర వ్యాప్తంగా హోం గార్డుల సెల‌వుల‌ను ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు స‌స్పెండ్ చేయ‌డంతోపాటు.. త‌క్ష‌ణం వారికి విధులు అప్ప‌గించాల‌ని హోం శాఖ అంత‌ర్గ‌త ఉత్త‌ర్వులు జారీ చేసింది. అదేస‌మ‌యంలో హైద‌రాబాద్‌కు ఇత‌ర ప్రాంతాల నుంచి హోం గార్డులు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్య‌త‌ల‌ను స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ల‌కు అప్ప‌గించింది. ఇక‌, హోం గార్డులు ఎవ‌రైనా ప్ర‌భుత్వం గీసిన ల‌క్ష్మ‌ణ రేఖ‌లు.. దాటితే వారిని త‌క్ష‌ణం ఉద్యోగాల నుంచి తొల‌గించాల్సి ఉంటుంద‌ని కూడా హెచ్చ‌రించింది.

బాధ్యత ఎవ‌రిది?

హోం గార్డు ర‌వీంద‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకుని మృతి చెందిన ఘ‌ట‌న‌పై ఆయ‌న స‌తీమ‌ణి సంధ్య క‌న్నీరు మున్నీరు అయ్యారు. త‌న భ‌ర్త మ‌ర‌ణానికి ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. ఏఎస్ ఐ, కానిస్టేబుల్ త‌న భ‌ర్త‌ను వేధించ‌డం వ‌ల్లే ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ఆమె ఆరోపించారు. మొత్తంగా ఈ విష‌యం ఇప్పుడు కేసీఆర్ స‌ర్కారుకు ఎన్నిక‌ల‌కు ముందు సెగ‌పుట్టిస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.