పాపం పూల‌మ్మ‌నే చోటే క‌ట్టెల‌మ్ముతోన్న ‘తుమ్మ‌ల‌ ‘…!

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలు అమ్మిన చోటే ఇప్పుడు కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి వచ్చేసింది. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్న తుమ్మల ఏ పార్టీలో ఉన్న తన ఆధిపత్యం చెలాయించుకుంటూ వచ్చారు. అప్పుడు తెలుగుదేశం… ఆ తర్వాత బీఆర్ఎస్ లోనూ ఆయన మంత్రి పదవులు చేపట్టారు. 2018 ముందస్తు ఎన్నికల్లో పాలేరులో మంత్రిగా ఉండి కూడా తుమ్మ‌ల చిత్తుగా ఓడిపోయారు. తుమ్మలపై కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి తర్వాత బిఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల గ్రాఫ్ శ‌ర‌వేగంగా పడిపోతూ వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ ప్రభంజనం వీచి 88 సీట్లతో ఆ పార్టీ అధికారంలోకి వస్తే పాలేరులో తుమ్మల ఓడిపోవడంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పెత్తనం మొత్తం కేసీఆర్ తుమ్మల చేతిలో పెడితే జిల్లాలో పువ్వాడ అజయ్ మినహా ఎవరు పార్టీ నుంచి గెలవలేదు. ఇటు జిల్లాలో పువ్వాడ అజయ్ మంత్రి కావటం… పాలేరులో తుమ్మ‌ల‌పై గెలిచిన‌ ఉపేందర్ రెడ్డి పట్టు బిగించడం… ఆయన బిఆర్ఎస్ లోకి వచ్చి పాలేరులో పార్టీ క్యాడర్‌ను మొత్తం తన వైపు తిప్పుకోవడం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో తుమ్మల రాజకీయంగా పూర్తిగా వెనకబడిపోయారు అని చెప్పాలి.

అంటే 40 సంవత్సరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించిన తుమ్మలను ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మరిచిపోతున్న దశ‌కు ఆయన వచ్చేసారు. అయితే పదే పదే ఆయన బలమైన నేతగా తనను తాను ప్రోజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. దీనిపై పాలేరు లో తుమ్మలను ఓడించిన ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, తుమ్మలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రజల్లో ఉండేది గెలిచేది తానే అని ఉపేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తుమ్మల బలమైన నేత అని పదేపదే అనడాన్ని ఉపేందర్ రెడ్డి అసలు అంగీకరించలేదు.

తుమ్మలకు అంత సీను ఉంటే మంత్రిగా ఉండి బిఆర్ఎస్ ప్రభంజనంలో ఎందుకు ? గెలవలేదని ప్రశ్నించారు. నిత్యం ప్రజల్లో ఉండే తనలాంటి నాయకుడిని ప్రజల గెలిపించుకుంటారని.. పాలేరు నుంచి ఎంతమంది పోటీ చేసిన తన గెలుపును అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఇక గోదావరి జిల్లాలకు తుమ్మల రాజకీయానికి ఏం సంబంధం ? అని కూడా ఉపేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఏది ఏమైనా తుమ్మల ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలనుంచి ఫేడ్ అవుట్ అవుతున్న వాతావరణమే స్పష్టంగా కనిపిస్తోంది.