తాడిప‌త్రిపైనా ఓ క‌న్నేయండి బాబూ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డ, ఇక్క‌డ అనే తేడా లేకుండా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబు త‌న ముద్ర ప‌డేలా చేస్తున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించేందుకు రెడీ అయ్యారు. అయితే, ఆయ‌న షెడ్యూల్ ప్ర‌కారం.. క‌ళ్యాణ‌దుర్గం, రాయ‌దుర్గం, గుంత‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌ర్య‌ట‌న‌కే ప‌రిమితం కానున్నారు. కానీ, స్థానికంగా మాత్రం త‌మ్ముళ్ల నుంచి తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌ర్య‌టించాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.

వాస్త‌వానికి అనంత‌పురం జిల్లాకు అనేక సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు వ‌చ్చినా.. తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఆయ‌న ఎప్పుడు ప‌ర్య‌టించ‌లేదు. ఇక్క‌డ అంతా బాగుంద‌ని అనుకుంటున్నారో.. లేక‌, ఇక్క‌డ తాను ఏం చేసినా ప్ర‌యోజ‌నం లేద‌ని భావిస్తున్నారో తెలియ‌దు కానీ.. తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు పూర్తిగా మౌనంగా ఉంటున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి మాత్రం పార్టీలైన్‌కు చాలా భిన్నంగా ఉంద‌నే వాద‌న సొంత పార్టీ నాయ‌కుల నుంచే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాడిప‌త్రి మునిసిప‌ల్ కౌన్సిల‌ర్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఒంటెత్తు పోకడలు నచ్చక సొంత పార్టీలోని కొందరు నాయకులు ఇప్పటికే టీడీపీని వీడారు. మరికొందరు వీడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు తనకు ఎమ్మెల్యే టికెట్‌ వస్తుందో? రాదోనన్న ఆందోళనతో తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి సొంత పార్టీలోనే కుంప‌ట్లు రాజేస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది.

తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గానికి చుట్టుప‌క్క‌ల ఉన్న అనంత‌పురం అర్బ‌న్‌, పుట్ట‌ప‌ర్తి, శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో జేసీ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. అయితే, ఇది పార్టీ అభివృద్ధికి కాకుండా.. వ్య‌క్తిగ‌త హ‌వాను చ‌లాయించేందుకు దోహ‌ద‌ప‌డుతోంద‌న్న‌ది స్థానిక నాయ‌కుల వాద‌న. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా తాడిప‌త్రిపై దృష్టి పెట్టాల‌ని, పార్టీ ప‌రిస్థితిని స‌మీక్షించి.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని ఇక్క‌డి నాయ‌కులు కోరుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.