చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు: సజ్జల

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ నోటీసులు పంపిందన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల రూపాయల ముడుపులు అందాయని కొన్ని ఇంగ్లీష్ పత్రికలలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై వైసీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ పత్రికలలో చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులను కూడా ముద్రించారని, కానీ ఆ వ్యవహారంపై చంద్రబాబు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని సజ్జల ప్రశ్నించారు.

మనోజ్ అనే వ్యక్తిని విచారణ జరిపే క్రమంలో ఆయన చంద్రబాబుపై స్టేట్మెంట్ ఇచ్చారని నేరుగా చంద్రబాబుకు ముడుపులు అందాయని ఆరోపించారని సజ్జల అన్నారు. రెండు కంపెనీలకు చంద్రబాబు కాంట్రాక్ట్ ఇచ్చారని, ఆ రెండు కంపెనీల ద్వారా కొన్ని షెల్ కంపెనీలకు నిధులు దారిమళ్లినట్లుగా ఆధారాలతో సహా ఐటీ శాఖ నోటీసులలో పేర్కొందని సజ్జలు అన్నారు. ఈ కేసులో జోన్ షిఫ్ట్ అనే టెక్నికల్ విషయాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు ఆలస్యం చేస్తూ వస్తున్నారని విమర్శించారు. ఆ ఆరోపణల పై స్పందించకుండా వ్యవస్థల నుంచి తప్పించుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు.

లోకేష్ సన్నిహితుడు కే రాజేష్ పాత్ర గురించి ఆ నోటిసులలో ఉందని ఆరోపించారు. తాను చంద్రబాబును తరచూ కలిసే వాడిని అని మనోజ్ … ఐటీ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు బరితెగించి అవినీతికి పాల్పడ్డారని, ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని తేలినా ఈడీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈ అంశంపై కేంద్ర నిఘా సంస్థలు విచారణ చేపట్టాలని సజ్జల డిమాండ్ చేశారు. జమిలి ఎన్నికల విషయంలో చర్చలు, సంప్రదింపులు కీలకమని, అది అర్జెంటుగా చర్చించాల్సిన స్థాయి అంశం కాదని సజ్జల వ్యాఖ్యానించారు.