కాంగ్రెస్ సెంటిమెంటు వర్కవుటవుతుందా ?

కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు జీవితం కాలం లేటన్నట్లుగా తయారైంది. తెలంగాణా విభజన జరిగిన తర్వాత తొందరలోనే మూడో ఎన్నిక జరగబోతోంది. అలాంటి మూడో ఎన్నికలో తెలంగాణా సెంటిమెంటును ప్రయోగించాలని కాంగ్రెస్ నేతలు డిసైడ్ అవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఆ సెంటిమెంటు ఏమిటంటే ‘తెలంగాణా ఇచ్చింది మేమే..తెలంగాణాను తెచ్చింది మేమే’ అనే సెంటిమెంటును ప్రయోగించాలని డిసైడ్ అయ్యిందట. ఇక్కడే కాంగ్రెస్ ప్రయోగించబోయే సెంటిమెంటు మీద జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఎందుకంటే తెలంగాణా సెంటిమెంటు 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కే వర్కవుట్ కాలేదు. మొత్తం 119 నియోజకవర్గాల్లో  అప్పట్లో టీఆర్ఎస్ కు వచ్చిందే 61 సీట్లు.  ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడానని, ఆమరణ నిరాహార దీక్ష చేశానని, చావునోట్లో తలపెట్టానని కేసీయార్ ఎన్నిమాటలు చెప్పినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు.  అప్పటి ఎన్నికల్లో కేసీయార్ వందశాతం సెంటిమెంటును రెచ్చగొట్టినా జనాలిచ్చింది కేవలం 61 సీట్లు మాత్రమే.

ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా సెంటిమెంటు పెద్దగా కలిసిరాలేదు. మొదటి రెండు ఎన్నికల్లోను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చేతకానితనమే ఎక్కువగా ఉంది. ప్రలోభాలకు లొంగిన 12 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అలాగే ఒత్తిళ్ళకు, ప్రలోభాలకు లొంగిపోయిన టీడీపీ ఎంఎల్ఏలు కూడా టీఆర్ఎస్ లో చేరారు. అప్పట్లోనే కాంగ్రెస్, టీడీపీ ఎంఎల్ఏలు గట్టిగా నిలబడుంటే రెండో ఎన్నికలోనే టీఆర్ఎస్ గెలుపు అనుమానంగా ఉండేది.

పై రెండు పార్టీలు కలిపే టీఆర్ఎస్ ను బలోపేతం చేశాయి. ఇక రాబోయే ఎన్నికల్లో సెంటిమెంటు వర్కవుటవుతుందని ఎవరు అనుకోవటం లేదు. అభివృద్ధి, అవినీతి, నిరుద్యోగం లాంటి అంశాలే కీలకపాత్ర పోషించబోతున్నాయి. వాస్తవం ఇలాగుంటే కాంగ్రెస్ మాత్రం తెలంగాణాను ఇచ్చింది మేమే..తెలంగాణాను తెచ్చింది మేమే అని చెప్పుకుంటే ఉపయోగం ఏమిటి ? చెప్పుకోవాల్సిన రెండు ఎన్నికల్లో సెంటిమెంటును ప్రయోగించలేకపోయింది. సెంటిమెంటును ఉపయోగించుకోవటంలో అప్పుడు ఫెయిలైన కాంగ్రెస్ ఇపుడు బీఆర్ఎస్ మీదకు ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. మరిపుడు వర్కువుటవుతుందా ? ఏమో చూడాల్సిందే.