కేసీఆర్ పై ఈటల, కేటీఆర్ పై బండి

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ను గద్దెదించి కాషాయా కండువా ఎగిరేయాలన్నది బీజేపీ లక్ష్యం. ఆ దిశగా బీజేపీ అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లోని కీలక నాయకులకు పోటీగా బీజేపీ తెలంగాణలోని ముఖ్య నేతలను పోటీగా దింపాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారడం ఖాయం.

బీజేపీ తెలంగాణ కీలక నేతలకు అగ్ని పరీక్ష పెట్టేందుకు అధిష్ఠానం సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతలందరినీ ఎన్నికల బరిలో దించాలని అధిష్ఠానం చూస్తోందని తెలిసింది. అంతే కాకుండా బీఆర్ఎస్లోని కీలక నాయకులు నిలబడే చోటులోనే బీజేపీ ముఖ్య నేతలను పోటి చేయించాలని భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికే గజ్వేల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈటల రాజేందర్ చెబుతున్నారు. దీంతో అక్కడ కేసీఆర్ పై పోటీకి ఈటలను బరిలో దింపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.

ఇక బీఆర్ఎస్ పార్టీలో మరో ఇద్దరు కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావుకు కూడా అగ్ర నాయకులతోనే చెక్ పెట్టాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. సిరిసిల్లాలో కేటీఆర్ పైకి పోటీగా బండి సంజయ్ పేరును బీజేపీ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. నిజానికి సంజయ్ వేములవాడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారంటా. కానీ కేటీఆర్ కు బలమైన పోటీ ఇవ్వాలంటే సంజయ్ సరైన అభ్యర్థి అని బీజేపీ భావిస్తుందని తెలిసింది. మరోవైపు సిద్ధిపేటలో హరీష్ కు పోటీగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను నిలబెట్టాలనే ఆలోచనలో బీజేపీ ఉందని తెలిసింది. అలాగే కేసీఆర్ పోటీ చేసే మరో స్థానం కామారెడ్డిలో ఎంపీ అర్వింద్ పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్లు టాక్. మరోవైపు మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణను పోటీలో నిలిపే అవకాశాలున్నాయి.