ఇండియా రోడ్ మ్యాప్ విడుదలవుతుందా ?

రెండురోజుల సమావేశాలు ముంబయ్ లో గురువారం మొదలవ్వబోతోంది. ఇండియకూటమిలోని 28 పార్టీల అధినేతల్లో దాదాపు ముంబయ్ కి చేరుకున్నారు. కూటమినేతల మధ్య ఇదే మూడో సమావేశం. మొదటి సమావేశం బీహార్ రాజధాని పాట్నాలో జరిగితే రెండో సమావేశం బెంగుళూరులో జరిగింది. ఇపుడు జరగబోయేది మూడో సమావేశం. ఈ సమావేశం కీలకమనే అంటున్నారు. ఎందుకంటే మూడు అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.

ఇంతకీ అంతటి కీలకమైన అంశాలు ఏవంటే మొదటిది ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరు ? రెండోది కూటమికి కన్వీనర్ ఎవరు ? మూడోది కూటమి పేరుతో ఒక లోగో తయారు చేస్తారట. అలాగే కూటమి తరపున కామన్ మినిమం ప్రోగ్రామ్ ను రెడీ చేసే విషయమై చర్చ జరిగే అవకాశముందంటున్నారు. హోలుమొత్తం మీద 2024 ఎన్నికలకు ఇండియాకూటమి తరపున రోడ్ మ్యాపు పై చర్చించే అవకాశముందన్నది సమాచారం.

ప్రతిపక్షాల్లో గ్రౌండ్ లెవల్లో ఉన్న అనైక్యతను బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అడ్వాంటేజ్ తీసుకుంటోంది. ఎన్డీయే కూటమిలో బీజేపీని మినహాయిస్తే మిగిలిన పార్టీలు దాదాపు జీరోనే చెప్పాలి. కానీ ఇండియాకూటమిలోని పార్టీలు అలాకాదు. ఇంచుమించు అన్నీ పార్టీలకు కాస్తా కూస్తో బలముంది. కూటమిలోని కొన్ని ప్రాంతీయపార్టీలు అధికారంలో కూడా ఉన్నాయి. దాంతో ఏ ఒక్కపార్టీ మిగిలిన పార్టీల మధ్య అధికారం చెలాయించే అవకాశంలేదు. ఒకవేళ ఏదన్నా పార్టీ అలా ప్రయత్నిస్తే వెంటనే మిగిలిన పార్టీలు ఎదురుతిరుగుతాయి.

మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మిగిలిన పార్టీలు ఆమోదించాలి. ఎందుకంటే కూటమిలోని మిగిలిన పార్టీలతో పోల్చితే అదే పెద్దపార్టీ. కానీ వాస్తవ పరిస్ధితిని తీసుకుంటే జాతీయస్ధాయిలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. అందుకనే ధైర్యంచేసి కూటమికి నాయకత్వం వహిస్తానని ప్రకటించలేకపోతోంది. తమలోని బలహీనతలు కూటమిలోని అన్నీ పార్టీలకు బాగా తెలుసు. కాకపోతే అన్నీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయంటే బీజేపీ అంటే ఉన్న భయంతోనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి మూడో సమావేశంలో పార్టీల అధినేతలు ఏమి మాట్లాడుతారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సిందే.