పెద్ద ఆఫర్ పట్టేసిన కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ పెద్ద ఆఫర్ పట్టేసినట్లు కనిపిస్తోంది. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నా నేపథ్యంలో వివిధ పార్టీల్లో నాయకుల చేరికల సందడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ పార్టీలోకి ఓ కీలక నాయకుడి ఎంట్రీతో పాటు బోనస్ గా న్యూస్ ఛానెల్, పేపర్ ను కూడా కాంగ్రెస్కు దక్కించుకోబోతుందని తెలిసింది. అసలు సంగతి ఏమిటంటే.. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. కానీ ఆయన ఒంటరిగా రావడమే కాదు తనతో పాటు తన న్యూస్ ఛానెల్, పేపర్ కూడా కాంగ్రెస్కు కలిసొచ్చేలా వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా వివేక్ వెంకటస్వామి ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ దక్కే సూచనలు లేకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఈ నెల 30న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇది తెలంగాణలో బీజేపీకి ఎదురు దెబ్బేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్ని రోజులు తన ఛానెల్, పత్రిక ద్వారా రాష్ట్రంలో బీజేపీకి పబ్లిసిటీ పెంచేందుకు వివేక్ పనిచేశారనే అభిప్రాయాలున్నాయి. కానీ ఇప్పటి నుంచి ఆ ఛానెల్, పత్రిక కాంగ్రెస్కు తగ్గట్లుగా పని చేయబోతున్నాయని టాక్.

తండ్రి దివంగత వెంకటస్వామి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వివేక్ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపునే పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమం సమయంలో 2013లో కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్లో చేరారు. కానీ మళ్లీ కాంగ్రెస్లో చేరి 2014లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్లారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరబోతున్నారని తెలిసింది.