ఇండియా ముంబై భేటీకి సోనియా?

ముంబైలో జరగబోతున్న ఇండియా కూటమి సమావేశానికి సోనియాగాంధి హాజరవబోతున్నారు.  ఈనెల 31వ తేదీన మొదలయ్యే రెండురోజుల సమావేశాలు చాలా కీలకం. అందుకనే కూటమిలోని కొన్నిపార్టీల అధినేతలు సోనియా హాజరవ్వాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందుకు సోనియా కూడా సానుకూలంగా స్పందించారు. ఇంతకీ అంతటి కీలకం ఏముంటంది ? ఏమిటంటే ఇండియాకూటమి కోసం ప్రత్యేకంగా జెండాను(లోగో) తయారు చేయబోతున్నారట.  అలాగే కన్వీనర్ పదవిపైన కూడా చర్చలు, నిర్ణయం ఉంటుంది.

ఇంతటి కీలకమైన సమావేశం కాబట్టి సోనియా కూడా ముంబై చేరుకుంటున్నారు. కూటమిలోని అన్నీ పార్టీలను ప్రతిఫలించేట్లుగా లోగో తయారుచేయటం చాలా అవసరమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు సీనియర్ నేతలు అనుకున్నారట. బహుశా రాబోయే ఎన్నికల్లో  ఈ కామన్ లోగో ద్వారానే బీజేపీని ఎదుర్కోవాలని ఇండియాకూటమి నిర్ణయించినట్లుంది. అందుకనే లోగోపై ఇప్పటికే భాగస్వామ్య పక్షాల మధ్య విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి.

అలాగే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా 30వ తేదీనే ముంబై చేరుకుంటున్నారు. ఆ రోజంతా ఆమె బిజిబిజీగా గడుపుతారు. తర్వాత రెండురోజులు కూటమి సమావేశాలతో ఫుల్లు బిజీ. ఇప్పటికే లోగో డిజైన్ పై చాలా చర్చలు జరిగాయి. కాబట్టి ఈ విషయమై రెండురోజుల్లో ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. కూటమి లెక్క ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులపై వన్ ఆన్ వన్ అనే పద్దతిలో అభ్యర్ధులను పోటీలోకి దింపాలని.

ఈ వన్ ఆన్ వన్ అనే సూత్రం ఎంతవరకు అమల్లోకి వస్తుందో కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాంటి కొందరు తమిష్టం వచ్చినట్లు పార్టీ అభ్యర్ధులను పోటీలోకి దింపబోతున్నట్లు చెబుతున్నారు. ఇదే పద్దతి కంటిన్యు అయితే కూటమిలో చీలికలు తప్పవు. అందుకనే కూటమికి ప్రత్యేకంగా కన్వీనర్ ను నియమిస్తే సీట్లు, చర్చలు, పొత్తులు లాంటివన్నీ కన్వీనర్ సమక్షంలోనే చర్చలు జరపాలని అనుకుంటున్నారు. ఒకవేళ కన్వీనర్ నియామకం జరిగితే బహుశా చాలా సమస్యలు పరిష్కారమవుతాయేమో చూడాలి.