కాంగ్రెస్ లో కొత్త సమస్య మొదలైందా?

కాంగ్రెస్ లో కొత్త సమస్య మొదలైందట. అదేమిటంటే పార్టీలో కొత్తగా చేరినవాళ్ళకి టికెట్లు దక్కుతుందా లేదా అని. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీచేయాలన్నా ముందు దరఖాస్తు చేసుకోవాల్సిందే అనే నిబంధన పెట్టారు. దాని ప్రకారం 119 నియోజకవర్గాలకు దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 18వ తేదీనుండి 25వ తేదీ వరకు అంటే వారంరోజుల పాటు దరఖాస్తులకు సమయమిచ్చారు. వారం రోజుల్లో సుమారు వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయి.

కొన్ని నియోజకవర్గాలకైతే 15 మంది కూడా అప్లైచేశారట. సోమవారం నుండి స్క్రూటినీ మొదలవ్వబోతోంది. వచ్చిన దరఖాస్తుల్లో పాత, కొత్తగా చేరిన నేతలు కూడా ఉన్నారు. ఇపుడు సమస్య ఏమిటంటే పాత నేతలను కాదని కొత్తనేతలకు టికెట్లిస్తే ఎలాగ ? కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్లిస్తే ఎట్టి పరిస్ధితుల్లోను సీనియర్లు అంగీకరించరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలాగని కొత్తగా చేరినవాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే పార్టీలో ఎవరు చేరుతారు ?

బీఆర్ఎస్ నుండి బలమైన నేతలను ఆకర్షించాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్టానం గోల్ రీచయ్యేదెప్పుడు ? పోనీ పాత, కొత్త మేలుకలయికగా టికెట్లిద్దామని అనుకున్నా కూడా కుదిరేట్లు కనబడటంలేదు. ఎందుకంటే మామూలుగానే టికెట్లకోసం పోటీపడే సీనియర్ల సంఖ్య కాంగ్రెస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇపుడు వీళ్ళకి కొత్తగా పార్టీలో చేరిన నేతల నుండి తీవ్రమైన పోటీ మొదలైంది. దాంతో వీళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయాలో పీసీసీకి అర్ధంకావటంలేదు.

ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధిష్టానానికి సూచించారట. ముందైతే దరఖాస్తులను స్క్రూటిని మొదలుపెట్టాలని ఆదేశించిందట. ఎందుకంటే స్క్రూటినీలో కొన్ని దరఖాస్తులను ఎలాగూ మైనస్ చేస్తారు. నికరంగా మిగిలిన దరఖాస్తులెన్నో మరో నాలుగు రోజుల తర్వాత తెలుస్తుంది. అప్పుడు మిగిలే దరఖాస్తులను బట్టి అభ్యర్ధుల విషయాన్ని ఫైనల్ చేయచ్చని చెప్పిందట అధిష్టానం. ఏదేమైనా టికెట్లను ఫైనల్ చేయటం కష్టమనే అనుకుంటున్నారు సీనియర్లు. ఎవరికి టికెట్ లేదని చెప్పినా మండిపోవటం ఖాయం. కాకపోతే కాస్త అడ్వాంటేజ్ ఏమిటంటే బీఆర్ఎస్ లో టికెట్లను ప్రకటించేయటం.