అందరి కన్ను పాలేరుపైనే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ టికెట్లు దక్కని నాయకులు.. బయటకు వచ్చి అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇతర పార్టీల కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ఓ నియోజకవర్గం పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదే.. పాలేరు నియోజకవర్గం. ప్రస్తుతం రాష్ట్రంలోని ముఖ్య నేతల కళ్లు అదే నియోజకవర్గంపై పడడమే అందుకు కారణం.

తెలంగాణలో రాజకీయ పరంగా పాలేరు నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఖమ్మం జిల్లాలోని ఈ నియోజకవర్గం నుంచి పోటీకి కీలక నేతలు మొగ్గు చూపుతుండడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పాలేరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా తన బలాన్ని ప్రదర్శించిన ఆయన ఎలాగైనా పాలేరు నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. వీలైతే కాంగ్రెస్ నుంచి లేదా స్వతంత్రంగా ఆయన బరిలో నిలిచే అవకాశముందని తెలిసింది.

మరోవైపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెను ఏపీకి పరిమితం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం అనుకోవడం.. షర్మిల డిమాండ్లకు సరే అనకపోవడంతో విలీన ప్రక్రియ వాయిదా పడినట్లు ప్రచారం సాగుతోంది. పాలేరు నుంచి తనకు టికెట్ కేటాయిస్తానంటేనే పార్టీని విలీనం చేస్తానని షర్మిల షరతు పెట్టినట్లు టాక్. మరోవైపు ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాలేరు టికెట్ ఆశిస్తున్నారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కందాల ఉపేందర్ రెడ్డి మరోసారి విజయాన్ని అందుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు.