మల్లారెడ్డి అల్లుడి పంట పండనుందా?

గతంలో టీడీపీ ఎంపీగా.. ఇప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా మల్లారెడ్డి జనాల్లో బాగానే పాపులర్ అయ్యారు. సంచలన వ్యాఖ్యలతో, ప్రాసలతో ప్రజలకు కనెక్ట్ అయ్యారనే అభిప్రాయాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆయన మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా పోటీ చేసేందుకు అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్ను మరోసారి మైనంపల్లి హన్మంత్ రావుకే కేసీఆర్ కేటాయించారు. కానీ మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి చేసిన సంచలన వ్యాఖ్యలపై పార్టీ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే అప్పుడు మల్కాజిగిరి అసెంబ్లీ సీటు ఎవరికిస్తారన్న ఆసక్తి నెలకొంది.

రేసులో ముందుగా మర్రి రాజశేఖర్రెడ్డి పేరు వినిపిస్తోంది. మర్రి లక్ష్మారెడ్డి విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటున్న రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోనూ పట్టు సాధించారనే టాక్ ఉంది. మామ మల్లారెడ్డి బాటలో సాగుతున్న ఆయన మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. జనంలో ఆదరణ, మల్లారెడ్డి సపోర్టు తదితర కారణాలతో రాజశేఖర్ రెడ్డి టికెట్ రేసులో ముందున్నారనే చెప్పాలి. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ,మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.