ఏపీలో దొంగ ఓట్లు…ఇద్దరు అధికారులు సస్పెండ్

ఏపీలో ఓట్ల నమోదు ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీ నేతలు, కొంతమంది అధికారులు కుమ్మక్కై దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ సీనియర్ నేత ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గతంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గతంలో ఉరవకొండలో పర్యటించారు. అనంతపురంలో 6000 దొంగ ఓట్లను చేర్పించారని, అందులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు నిర్ధారించారు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.

అయితే, ఆదేశాలిచ్చి రోజులు గడుస్తున్నా భాస్కర్ రెడ్డిని విధుల నుంచి తొలగించలేదు. దీంతో, తాజాగా మరోసారి ఆ తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, జిల్లా పరిషత్ సీఈఓ గా ఉన్న భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంలో మరో అధికారిపై వేటు పడింది. గతంలో జడ్పీ సీఈఓ గా ఉన్న శోభా స్వరూపారాణిని సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021 లో జడ్పీ సీఈఓ గా పనిచేసిన స్వరూపా రాణి ఆ సమయంలో 1796 ఓట్లను అక్రమంగా తొలగించడంపై తాజాగా చర్యలు తీసుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ కు గెస్ట్ ఇన్స్ట్రక్టర్ గా స్వరూపా రాణి పనిచేస్తున్నారు.

ఇలా, రాష్ట్రంలోని పలు జిల్లాలలో కొందరు అధికారులు అధికార పార్టీతో చేతులు కలిపి దొంగ ఓట్లను సృష్టించడం, టీడీపీకి జనసేనకు చెందిన ఓట్లను అక్రమంగా తొలగించడం వంటి చర్యలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన నేతలు చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిగతా జిల్లాలపై కూడా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు దృష్టి పెడితే ఇటువంటి అవకతవకలు మరిన్ని బయటపడే అవకాశాలున్నాయని టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు.