బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందా ?

అవుననే అంటోంది ఒక రీసెంట్ సర్వే ఫలితం. తెలంగాణా ఇంటెన్షన్.కామ్ పేరుతో మొత్తం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సర్వే జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ 1024 శాంపిల్స్ తీసుకున్నారు. ఆగష్టు 6-12 తేదీల మధ్య విస్తృతమైన సర్వే నిర్వహించారు. శాంపిల్స్ ఆధారంగా రాష్ట్రంలో పొలిటికల్ మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు మాత్రమేచేసిన సర్వే ఇది. దాని ప్రకారం చూస్తే గతంతో పోలిస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పడిపోయినట్లు అర్ధమవుతోంది.

2018 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల షేర్ 47.4 శాతం. తాజా సర్వేలో ఈ ఓటు షేర్ 40 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. అంటే ఏకంగా 7 శాతం ఓట్లు పడిపోయిందని అర్ధమవుతోంది. 7 శాతం ఓట్లు పడిపోవడం అంటే చిన్న విషయం కాదు. ఇక 27.6 శాతం ఓట్లతో కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలబడగా 14.8 శాతం ఓట్లతో బీజేపీ మూడో ప్లేసులో నిలుస్తుందని తేలిందట.

ఒకవైపేమో సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధితో తెలంగాణా ప్రగతి పథంలో దూసుకుపోతోందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ కో పొద్దు లేచింది మొదలు ఒకటే ఊదరగొడుతున్నారు. తెలంగాణాలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశంమొత్తంలో ఎక్కడా అమలుకావటంలేదని చెబుతుంటారు. మహారాష్ట్రతో పాటు చాలా రాష్ట్రాల్లో తెలంగాణా మోడలే అమలుకావాలని జనాలు డిమాండ్లు చేస్తున్నట్లు పదేపదే చెప్పుకుంటున్నారు. తీరా సర్వేచేస్తే 40 శాతం ఓట్లు పడతాయని తేలింది.

షెడ్యూల్ ఎన్నికలకు ఇక ఉన్నది నాలుగు మాసాలు మాత్రమే. వాస్తవానికి కేసీయార్ పాలనపై జనాల్లో బాగా వ్యతిరేకత కనబడుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల బలహీనత కూడా అర్ధమవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఒకళ్ళు చెప్పటం మిగిలిన వాళ్ళు వినటం ఉండదు. సీనియర్ నేతల మధ్య వివాదాలు, ఆధిపత్య పోరు వల్లే గెలుపు అవకాశాలను పోగొట్టుకుంటోంది. ఇదే సమయంలో బీజేపీని చూస్తే అసలు నాయకత్వ లక్షణాలున్న నేతలు చాలా తక్కువ. అన్నీ నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులకు ధీటుగా పోటీ ఇవ్వగలిగిన నేతలు చాలా తక్కువ. బహుశా ఈ కారణాలతోనే కేసీయార్ హ్యాట్రిక్ సాధించే అవకాశముంది. మరి ఎన్నికలనాటికి ఏమవుతుందో చూడాల్సిందే.