ఎంపీగా శ్రీదేవి.. అదే బాబు ప్లాన్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యేగా తాడికొండ నుంచి గెలిచిన ఉండ‌వ‌ల్లి శ్రీదేవి టీడీపీలో చేర‌డం ఖాయ‌మైంది. ఇటీవ‌ల టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర తాడికొండ చేరుకుంది. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి రైతుల‌తో లోకేష్ ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉండ‌వ‌ల్లి శ్రీదేవి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మైన ఆమె.. వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కూడా చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీకి మేలు చేసేలా క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌ల‌తో శ్రీదేవిని వైసీపీ స‌స్పెండ్ చేసింది. ఇక ఆమెను టీడీపీలో చేర్చుకునేందుకు సిద్ధ‌మైన చంద్ర‌బాబు ఓ కండీష‌న్ పెట్టార‌ని తెలిసింది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాడికొండ నుంచి టీడీపీ త‌ర‌పున శ్రీదేవి పోటీ చేయాల‌ని చూస్తున్నారు. అది కాక‌పోతే ప్ర‌త్తిపాడు స్థానంలోనైనా ఛాన్స్ ఇవ్వాల‌ని బాబును కోరుతున్న‌ట్లు తెలిసింది.

కానీ తాడికొండ‌లో ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే శ్రావ‌ణ్ కుమార్‌కు టీడీపీ త‌ర‌పున టికెట్ ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. ఇక ప్ర‌త్తికొండ‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజ‌నేయుల‌కు బాబు అవ‌కాశం ఇస్తార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో శ్రీదేవిని బాప‌ట్ల లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం బ‌రిలో దింపే ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు టాక్‌. అక్క‌డి నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న నందిగాం సురేష్‌కు శ్రీదేవితో చెక్ పెట్టాల‌న్న‌ది బాబు ప్లాన్‌గా క‌నిపిస్తోంది. మ‌రి అందుకు శ్రీదేవి ఒప్పుకుంటారా? లేదా? అన్న‌ది చూడాలి.