పెరిగిపోతున్న నంద్యాల పోరు

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసేందుకు తెలుగుదేశంపార్టీలో పోటీ పెరిగిపోతోంది. మొత్తం నలుగురు నేతలు టికెట్ కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధి ఎవరనే విషయాన్ని అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించటం ఆలస్యమయ్యే కొద్దీ నేతల మధ్య పోరు ఎక్కువైపోతోంది. ప్రస్తుత ఇన్చార్జి భూమా బ్రహ్మానందరెడ్డి రాబోయే ఎన్నికల్లో తానే అభ్యర్ధిని అని చెప్పుకుంటు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంఎల్ఏ భూమానాగిరెడ్డి వారుసుడిగా పోటీచేయబోయేది తానే అంటు కొడుకు భూమా జగద్విఖ్యాతరెడ్డి రేసులోకి దూసుకొచ్చారు.

జగన్ భూమా కుటుంబం మద్దతుదారులతో తరచు సమావేశమవుతున్నారు. పోటీ చేయబోయేది తానే అంటు నానా రచ్చ చేస్తున్నారు. వీళ్ళ సంగతి పక్కనపెట్టేస్తే మాజీ మంత్రి సీనియర్ నేత ఎన్ఎండీ ఫరూక్ తో పాటు ఏవీ సుబ్బారెడ్డి కూడా పోటీకి రెడీ అంటున్నారు. వీళ్ళు సరిపోరన్నట్లు మాజీమంత్రి ఆళ్ళగడ్డ నియోజకవర్గం ఇన్చార్జి భూమా అఖిలప్రియ కూడా నంద్యాలలోనే తిరుగుతున్నారు. ఈమె ఎక్కడినుండి పోటీచేస్తారో తెలీదు.

అసలీమెకు టికెట్ ఇస్తారో లేదో కూడా తెలీదు. ఎందుకంటే చంద్రబాబునాయుడు, లోకేష్ మాజీమంత్రిని దగ్గరకు కూడా రానీయటంలేదు. అయినా సరే అఖిల మాత్రం తన మద్దతుదారులతో తిరిగేస్తున్నారు. ఇక చివరకు అఖిల చెల్లెలు భూమా మౌనిక కూడా పోటీకి రెడీ అనేశారు. మౌనిక ఆళ్ళగడ్డ నుండా లేకపోతే నంద్యాల నుండి పోటీకి దిగుతారో తెలీటంలేదు.

ఈమధ్యనే భర్త మనోజ్  తో కలిసి మౌనిక పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. దాంతో మౌనికకు ఆళ్ళగడ్డలో టికెట్ ఖాయమనే ప్రచారం జరిగింది. అఖిలకు టికెట్ ఇవ్వదలచుకోలేదు కాబట్టి చెల్లెలు మౌనికకు టికెట్ ఇస్తారనే అనుకున్నారు. అయితే మౌనిక పోటీచేయబోయే నియోజకవర్గంపైన క్లారిటిలేదు. ఎందుకంటే అసలు మౌనిక విషయంలో  చంద్రబాబు ఆలోచనలు ఏమిటో కూడా ఎవరికీ తెలీదు. ఏదేమైనా అభ్యర్ధుల విషయంలో నిర్ణయం ప్రకటించటం ఆలస్యమయ్యేకొద్దీ రెండు నియోజకవర్గాల్లోను గందరగోళం పెరిగిపోతోంది. ముఖ్యంగా నంద్యాల అసెంబ్లీ సీటుపైన పార్టీలో గొడవలు అయిపోతున్నాయి. కాబట్టి చంద్రబాబు ఏదో ఒకటి తేల్చితే మంచిది. లేకపోతే కష్టాలు తప్పవు.