ప‌వ‌న్‌పై ఈ అప‌వాదు ఇప్ప‌టికైనా పోతుందా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు, కామెంట్లు కామ‌నే. అయితే.. కొన్ని కొన్ని విష‌యాలు మాత్రం నాయ‌కు లకు ఇబ్బందిగానే ఉంటాయి. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌గ‌న్‌.. నాలుగేళ్ల‌యినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌లేక‌పోతున్నారని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఇలాంటివి నాయ‌కుల‌ను దీర్ఘ‌కాలంలో ఇబ్బందుల‌కు గురి చేస్తాయి. ఇలాంటి అప‌వాదే.. ఒక‌టి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను కూడా వెంటాడుతోంది. నాలుగేళ్లు గ‌డిచిపోయినా.. ఆయ‌న త‌న‌కు ఓటేసిన వారిని ప‌ట్టించుకోలేద‌ని.. క‌నీసం.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో తిర‌గ‌లేద‌ని.. తాజాగా వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

రాజ‌కీయ కోణం ప‌క్క‌న పెడితే.. ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌ని.. ఓడినా .. గెలిచినా.. త‌న‌కు సంబంధం లేద‌ని.. ప్ర‌జ‌ల కోస‌మే తాను ఉన్నాన‌ని ప‌దే ప‌దే చెప్పే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇలా చేయ‌డం భావ్యం కాద‌నే వాద‌న అయితే.. వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

గ‌త 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌.. త‌న పార్టీ త‌ర‌ఫున రెండునియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేశారు. ఒక‌టి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని గాజువాక‌, రెండు ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాలోని భీమ‌వ‌రం. ఈ రెండు చోట్ల కూడా కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డంతో గెలుపు ఖాయ‌మ‌ని భావించారు. కానీ, అనూహ్యంగా ఓట‌మి ఎద‌రైంది.

అయితే.. ఓట్లు ప‌రంగా చూసుకుంటే.. భీమ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు 62,285 ఓట్లు వ‌చ్చాయి. ఇక్క‌డ నుంచి గెలిచిన వైసీపీ నాయ‌కుడు గ్రంధి శ్రీనివాస్‌కు 70,642 ఓట్లు వ‌చ్చాయి. కేవ‌లం 8 వేల పైచిలుకు ఓట్ల‌తోనే ఇక్క‌డ ప‌వ‌న్ ఓడిపోయారు. ఇక‌, గాజు వాక విష‌యానికి వ‌స్తే..ఇక్క‌డ నుంచి పోటీ చేసిన ప‌వ‌న్‌కు 56,125 ఓట్లు ల‌భించాయి. సో.. అక్క‌డ భీమ‌వ‌రంలోనూ.. ఇక్కడ గాజు వాక‌లోనూ వేలాది మంది ప‌వ‌న్‌కు ఓటేశారు. గెలుపు, ఓట‌ముల‌ను ప‌క్క‌న పెడితే.. ఈనాలుగేళ్ల‌లో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ప‌ర్య‌టించలేద‌న్న‌ది వైసీపీ నాయ‌కుల విమ‌ర్శ‌.

వాస్త‌వం ప‌రిశీలించినా.. ఇదే క‌నిపిస్తోంది. ప‌వ‌న్ అనేక సార్లు విశాఖ ప‌ట్నం వెళ్లినా.. గాజువాక‌లో ప‌ర్య‌టించ‌లేదు. ఇక‌, ఇటీవ‌ల వారాహి యాత్ర 1.0లో ప‌శ్చిమ‌లో ప‌ర్య‌టించినా.. భీమ‌వ‌రం జోలికి వెళ్ల‌లేదు. సో.. దీనివ‌ల్ల ఆయ‌న‌పై అప‌వాదు ప‌డుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతాన‌న్న ప‌వ‌న్‌..ఈ నాలుగేళ్ల కాలంలో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా వేల సంఖ్య‌లో ఓట్లేసిన వారిని క‌నీసం ప‌న్నెత్తి ప‌ల‌క‌రించ‌క‌పోవ‌డాన్ని వైసీపీ నాయ‌కులు త‌ప్పుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికైనా ఈ అప‌వాదు నుంచి ప‌వ‌న్ బ‌య‌ట ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.