కీల‌క ఓటు బ్యాంకుపై టీడీపీ వ్యూహం!

ఔను.. అటు మ‌హిళ‌లు.. ఇటు రైతులు.. ఈ రెండు ఓటు బ్యాంకులు ఏ పార్టీకైనా అత్యంత కీల‌కం. ఎందు కంటే.. ఎన్నిక‌ల్లో ఇత‌ర వ‌ర్గాల ఓటు బ్యాంకుఎలా ఉన్నా.. ఈ రెండు మాత్రం ఎటూ పోవు. ఖ‌చ్చితంగా పోలింగ్ బూత్‌కు వ‌చ్చేవారిలో రైతులు మ‌హిళ‌లు ఉంటారు. అందుకే.. ఈ రెండు ఓటు బ్యాంకుల‌పైనా.. పార్టీలు క‌న్నేస్తాయి. ఇదే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి భారీ మైలేజీ ఇచ్చింద‌నే చ‌ర్చ ఉంది.

ఇక‌, ఇప్పుడు రైతులు, మ‌హిళా ఓటు బ్యాంకును త‌మవైపు తిప్పుకొనేందుకు టీడీపీ కూడా యుద్ధ ప్రాతిపది క‌న ముందుకు సాగుతోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. క్షేత్ర‌స్థాయిలో రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేలా యాత్ర‌లు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధం పేరుతో ఆయ‌న జిల్లాల్లో ప‌ర్య‌టించి.. ఆయా ప్రాజెక్టుల తీరుతెన్నులు.. గ‌తంలో త‌మ హ‌యాంలో ఎలా నిర్మాణాలు పూర్తి చేశాం. ఇప్పుడు ఏం జ‌రుగుతోంది? అనే విష‌యాల‌ను వివ‌రిస్తున్నారు.

దీంతో రైతాంగంలోనూ.. చ‌ర్చ ప్రారంభ‌మైంది. త‌మ‌కు జ‌రుగుతున్న ప్ర‌యోజ‌నంపై వారు చ‌ర్చించుకుం టున్నారు. ఇదేస‌మ‌యంలో రైతుల‌కు టీడీపీ హ‌యాంలో జ‌రిగిన మేలు ను కూడా చంద్ర‌బాబు వివ‌రిస్తు న్నారు. రుణ మాఫీ నుంచి సాగు నీటి ప్రాజెక్టులు, ప‌ట్టిసీమ వంటివాటి ద్వారా రైతుల‌కు మేలు జ‌రిగేలా తీసుకు న్న నిర్ణ‌యాల‌ను వివ‌రించారు. దీంతో రైతాంగంలోనూ మార్పుక‌నిపిస్తోంద‌ని టీడీపీ నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు.

మ‌రోవైపు.. మ‌హిళా ఓట‌ర్ల‌ను చేరువ చేసుకునేందుకు ఈ ఏడాది మేలో ప్ర‌క‌టించిన మినీ మ‌హానాడును గ్రామీణ స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు. సైలెంట్‌గా జ‌రుగుతున్న ఈ ప్ర‌చారం .. గ్రామ గ్రామానా జోరుగా సాగుతోంది. ప్ర‌తి ఇంటికీ వెళ్తున్న టీడీపీ మండ‌ల‌స్థాయి నాయ‌కులు.. ఇక్క‌డి మహిళ‌ల‌ను క‌లుస్తూ.. మేనిఫెస్టోలో మ‌హిళా శ‌క్తి.. గురించిన ప‌థ‌కాల‌ను వివ‌రిస్తున్నారు. అండ‌ర్ కరెంట్‌గా సాగుతున్న ఈ ప్ర‌చారం త‌మ‌కు మేలు చేస్తుంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతుండ‌డంగ‌మ‌నార్హం.