తెలంగాణ‌లో వ‌ద్దు.. ఏపీలో అన్న‌పై పోరు!

వైఎస్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల‌కు నిరాశ త‌ప్పేలా లేదు. ఎన్నో ఆశ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి, మంత‌నాలు చేసి.. కాంగ్రెస్‌లో త‌న పార్టీని విలీనం చేయాల‌నుకున్న ష‌ర్మిల‌కు హ‌స్తం పార్టీ చేయి ఇచ్చేలా క‌నిపించ‌డం లేదనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్‌లో ఆమె పార్టీ విలీనం కోసం అధిష్ఠానం కొన్ని ష‌ర‌తులు పెట్టిన‌ట్లు స‌మాచారం. పార్టీని విలీనం చేసిన త‌ర్వాత తెలంగాణ‌లో కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ త‌ర‌పున ప‌ని చేయాల‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. దీంతో ష‌ర్మిల డైల‌మాలో ప‌డ్డార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పార్టీ విలీనం కోసం బెంగ‌ళూరు వెళ్లి డీకే శివ‌కుమార్‌ను క‌లిసి.. కాంగ్రెస్ అధిష్ఠానంతో ష‌ర్మిల చ‌ర్చ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వైఎస్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకోవ‌డానికి కాంగ్రెస్ ప‌చ్చ‌జెండా ఊపింద‌ని, ఈ నెల 19న ముహూర్తం ఫిక్స్ చేశార‌నే ఊహాగానాలు వినిపించాయి. ష‌ర్మిల కూడా దిల్లీ వెళ్ల‌డంతో ఇదే జ‌రుగుతుంద‌నిపించింది. కానీ అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ష‌ర్మిల‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేద‌ని అంటున్నారు.

కాంగ్రెస్‌లో చేరి పాలేరు నుంచి పోటీ చేయాల‌ని ష‌ర్మిల అనుకున్నార‌ని తెలిసింది. కానీ తెలంగాణలో ఆమె పార్టీలో ఉండ‌డాన్ని ఇక్క‌డి కాంగ్రెస్ నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన వైఎస్ఆర్ త‌న‌య ష‌ర్మిల పార్టీలోకి వ‌స్తే తెలంగాణ‌లో అది కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ అవుతుంద‌ని ఇక్క‌డి నాయ‌కులు భావిస్తున్న‌ట్లు తెలిసింది. కావాలంటే ఏపీలో కాంగ్రెస్ త‌ర‌పున ప‌ని చేయ‌మని చెప్పండి అని కూడా పేర్కొన్నారంటా. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ష‌ర్మిల‌కు చెప్పిన‌ట్లు తెలిసింది. ఏపీలో అధికారంలో ఉన్న అన్న జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ష‌ర్మిల ప‌ని చేయ‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి పార్టీ విలీనంపై ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.