అసూయ, ద్వేషాలతోనే పవన్ అలా.. : మంత్రి అమర్నాథ్‌!

గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మూడో విడత వారాహి యాత్ర వైజాగ్‌ లో ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో భాగంగా పవన్‌ రాత్రి జగదాంబ సెంటర్ లో బహిరంగ సభలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఏపీ సీఎం జగన్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి విరుచుకుపడ్డారు.తెలంగాణ రావడానికి ముఖ్య కారణం జగనే అని విమర్శించారు. జగన్ తో పాటు ఆయన అనుచరులు అందరూ తెలంగాణలోని భూములు దోచుకు తిన్నారు. అందుకే అక్కడి వారందరూ తరిమేశారు. ఏపీకి పొమ్మని గట్టిగా బుద్ది చెప్పారు.

ఇక్కడ ఉన్న రుషి కొండ, ఎర్ర మట్టి దిబ్బలు, సహజ వనరులు కూడా దోచుకుంటున్నారని పవన్‌ ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగకుండా కేంద్రంతో కలిసి నిన్ను ఒక ఆటాడిస్తా జగన్ అంటూ సీఎంకి వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. పవన్‌ వ్యాఖ్యల పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీని పై ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పందించారు.

విశాఖ వేదికగా పవన్‌ అసూయతో అసత్యాలు మాట్లాడారు. పవన్‌ అనే అమాయకుడిని చూసి రాష్ట్ర ప్రజలు జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారాహి అనే లారీ మీద ఎక్కి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే విమర్శిస్తున్నాడు అంటే అతనికి ఎంతటి అసూయ ఉంతో తెలుస్తుందన్నారు. జగన్‌ కి పవన్‌ కి మధ్య ఉన్న వ్యత్యాసం ఎలాంటిదో వేమన ఎప్పుడో చెప్పారంటూ పేర్కొన్నారు. పవన్‌ కి ఓ స్థిరత్వం, సిద్దాంతం ఏమి లేదు. ప్రస్తుతం పవన్‌ పరిస్థితి ఎలా ఉంది అంటే..బీజేపీతో సంసారం..టీడీపీతో సహజీవనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజలతో మాట్లాడేటప్పుడు ప్రజలకు ఫలానా పథకాలు తీసుకోస్తాం, ఫలానా అభివృద్ధి పనులు చేపడతాం అని చెప్పాలి…కానీ పవన్‌ ఎప్పుడన్నా అలాంటి మాటలు మాట్లాడారా? అని ప్రశ్నించారు. పవన్‌ వెనకలా ఉన్న అసలైన నిర్మాత చంద్రబాబు. ఆయన దేని గురించి చెబితే పవన్‌ అదే మాట్లాడతాడు అంటూ విమర్శించారు. జగన్‌ వెంట ప్రజలు ఉన్నారు. పవన్ ఆయన దత్త తండ్రి లాంటి వారు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ వైసీపీనే ఎన్నుకునేందుకు ప్రజలు సిద్దమయ్యారని అమర్నాథ్‌  చెప్పారు.