ఆది నుంచి ఆప్‌పై క‌క్షే.. ప్ర‌భుత్వం ఉన్నా.. `అధికారం` సున్నా!

రాజ‌కీయ పంతం-రాజ‌కీయ క‌క్ష‌.. కొంత నిశితంగా చూస్తే.. ఈ రెండింటికీ మ‌ధ్య పెద్ద‌గా తేడాలేదు. కానీ, పంతం విష‌యానికి వ‌స్తే.. అంతో ఇంతో స‌డ‌లింపు ఇచ్చే ప‌రిస్థితి ఉంటుంది. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా.. లేదా.. త‌మ‌కు అన‌నుకూల ప‌రిణామాలు ఉన్న‌ప్పుడు పంతం కొంత వెన‌క్కి మ‌ళ్లే అవ‌కాశం ఉంటుంది. కానీ, రాజ‌కీయ క‌క్ష మాత్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ పోదు.. ఇదే ఇప్పుడు ఢిల్లీ అధికారాల‌పై జ‌రిగింద‌నే చ‌ర్చ దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోంది.

తాజాగా రాజ్య‌స‌భ‌లో ఢిల్లీ స‌ర్వీసుల అధికారాల‌కు సంబంధించి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్న ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన బిల్లును అంత తేలిక‌గా.. చూసేందుకు వీలు లేదు. కేంద్ర పెద్ద‌లు ఉవ‌చిస్తున్న‌ట్టు ఇది కేవ‌లం అవినీతి ర‌హిత ఢిల్లీ పాల‌న‌ను అందించేందుకు ఉద్దేశించిందే కాదు. నిజానికి ఇదే ఉద్దేశం ఉంటే.. అంద‌రూ హ‌ర్షించాల్సిందే. దేశ‌వ్యాప్తంగా కూడా ఇలాంటి చ‌ట్టం చేసినా.. ఆహ్వానించాల్సిందే. ఎవ‌రు మాత్రం.. అవినీతిని కోరుకుంటారు.

అన్ని రాష్ట్రాల్లోనూ అవినీతి ర‌హిత పాల‌న అందించేందుకు మోడీ న‌డుం బిగిస్తే.. చ‌ట్టం చేస్తే.. కాద‌నే వారు మాత్రం ఎవ‌రు ఉంటారు?! కానీ, ఢిల్లీ బిల్లు ఉద్దేశం వేరు. దీని వెనుక ఉన్న‌వ్యూహం వేరు. ప్ర‌జాభిమానాన్ని చూర‌గొని.. అన‌తి కాలంలోనే ఢిల్లీ రాజ్యంపై అధికారం ద‌క్కించుకున్న ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌ను అశ‌క్తుడిని చేయ‌డం.. ఆయ‌న దూకుడుకు క‌ళ్లెం వేసి.. కాళ్లు క‌ట్టి ప‌రిగెట్టించాల‌నే కుత్సిత వ్యూహ‌మే ఈ బిల్లు వెనుక దాగి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

“ఢిల్లీలో మా ప్ర‌భుత్వమే ఉంటుంది. మాకే ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తారు!“ అని ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో సుష్మాస్వ‌రాజ్ చేసిన వ్యాఖ్య‌లు ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌నార్హం. కానీ, ఆమెకు ఇక్క‌డి ప్ర‌జ‌లు భారీ షాక్ ఇచ్చారు. త‌ర్వాత వ‌రుస‌గా.. చీపురు పార్టీకి రెడ్ కార్పెట్ ప‌రిచారు. ఇదే.. బీజేపీకి కంట్లో న‌లుసుగా మారింది. అంతేకాదు.. మ‌రోవైపు పంజాబ్‌లోను పార్టీ పుంజుకుని ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం.. కంట్లో న‌లుసుపోయి.. కారం ప‌డినంత ఆవేద‌న ఏర్ప‌డింది.

మ‌రోవైపు.. గుజ‌రాత్‌లోనూ.. ఆప్ పుంజుకుంటోంది. ఈ ప‌రిణామాల‌తోనే ఎడ‌తెగ‌ని రాజ‌కీయ క‌క్ష‌కు బీజం ప‌డి.. నేడు వ‌ర్థ‌మాన‌మై.. కేజ్రీవాల్‌కు స‌ర్వాధికారాల‌ను బుట్ట‌దాఖ‌లు చేస్తూ.. ఈ బిల్లును తీసుకువ‌చ్చార నేది బీజేపీలోనే చ‌ర్చ‌గా మారిన వ్య‌వ‌హారం. ఆది నుంచి పెంచుకున్న క‌క్ష‌.. నేడు బిల్లు రూపంలోకి మారి.. ఆప్ కుత్తుక క‌త్తిరించే వ‌ర‌కు నిద్ర‌పోబోమ‌న్న విధంగా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికైతే.. బిల్లు అయిపోయింది. రేపు చ‌ట్టంగా కూడా మారుతుంది. కానీ, ప్ర‌జ‌లు అనేవారు ఉన్నారు క‌దా.. ఏం చెబుతారో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.