అసెంబ్లీ అదిరిపోయేలా.. కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌సంగం.. !!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ద‌ద్ద‌రిల్లే ప్ర‌సంగం చేశారు. గంటా 42 నిమిషాల‌పాటు నిరాఘాటంగా ప్ర‌సంగించిన కేసీఆర్.. ఆసాంతం.. ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునేలా ప్ర‌సంగించారు. మ‌రో మాట‌లో చెప్పాలంటే.. ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌సంగ‌మే చేశారు. నిజాం సంస్థానం పాల‌న నుంచి నేటి త‌న పాల‌న వ‌ర‌కు పూస గుచ్చిన‌ట్టు వివ‌రించారు. ఏపీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు.. రాష్ట్రాల‌తో ఆయ‌న పోలిక పెట్టారు. ఒక‌టి కాదు.. రెండు కాదు.. అనేక విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ప‌నిలో ప‌నిగా.. తెలంగాణ ఇచ్చామ‌ని చెప్పుకొనే కాంగ్రెస్‌కు చావు దెబ్బ‌లాంటి వ్యాఖ్య‌లు చేశారు. వెర‌సి మొత్తంగా అసెంబ్లీ అదిరిపోయేలా కేసీఆర్ ప్ర‌సంగించారు.

“ఓట్లకోసం ఎవరు ఏం అనుకుంటారో అని మేము భయపడం. కర్ణాటకలో ఎన్ని హామీలు ఇచ్చినా బీజేపీని తన్ని తరిమేశారు. 4 వేలు పెన్షన్ పెంచుతామని కాంగ్రెస్ అంటోంది. మేం 5 వేలు పెంచుతామని అంటాం. అలా చెప్పడం కాదు..చేయాలి. అందుకే మేము సాధ్యం అయ్యేదే చెబుతాం. పెన్షన్లు కచ్చితంగా పెంచుతాం.. కానీ ఒకేసారి పెంచం. కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇస్తోంది. చేయగలిగేది చెప్పాలి.. అలా కాని పక్షంలో ప్రజలు నమ్మరు. మా అమ్ముల పొదిలో ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి” అంటూ.. కాంగ్రెస్ నేత‌ల‌వైపు చూస్తూ.. కేసీఆర్ వ్యాఖ్యానించిన తీరు న‌భూతో అన్న విధంగా సాగింది.

ఉద్యోగుల విష‌యాన్ని ప్ర‌ధానంగా కేసీఆర్ ప్ర‌స్తావించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వ‌ని విధంగా ఉద్యోగుల‌కు ఎక్కువ వేతనాలు ఇస్తోంది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని ఆయ‌న బ‌ల్ల చ‌రిచి మ‌రీ చెప్పారు. సింగరేణి కార్మికులకు వెయ్యి కోట్లు బోనస్ ఇవ్వబోతున్నామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. ఉద్యోగులకు పేస్కేల్ పెంచుతామని చెప్పారు. దేశం ఆశ్చర్యపోయేలా పెంపు ఉంటుందని అసెంబ్లీలో బీఆర్ఎస్ స‌భ్యుల హ‌ర్ష ధ్వానాల మ‌ధ్య‌ కేసీఆర్ ప్రకటించారు.

అతి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్(మ‌ధ్యంతర భృతి) ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు కూడా తమ పిల్లలేనని, వాళ్లను బాగా చూసుకుంటామని కేసీఆర్ తెలిపారు. ఆర్థిక వనరులు సమకూరగానే మళ్లీ జీతాలు పెంచుతామని కేసీఆర్ తెలిపారు. ఇదిలావుంటే, దివ్యాంగులకు పెన్షన్ ను ఇటీవ‌లే వెయ్యి పెంచారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి, బీసీ బంధు, ముస్లింలకు లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు విలీనం ఇలా వరుసగా కేసీఆర్‌.. ఎన్నిక‌లకు 4 మాసాల ముందే.. త‌న ఎన్నిక‌ల వ్యూహాల‌ను అమ‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.