టీటీడీ కొత్త ఛైర్మన్ గా భూమన

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) కొత్త ఛైర్మన్‌గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అన్న విషయంపై చాలాకాలంగా సందిగ్దత ఏర్పడిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఆ పదవి దక్కనుందని ప్రచారం జరిగింది. ఇక, జంగాతో పాటు మరికొందరు నేతల పేర్లు కూడా వినిపించాయి. అయితే, చివరకు తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ నూతన చైర్మన్ గా నియమించారు సీఎం జగన్.

అయితే, భూమన టీటీడీ ఛైర్మన్ గా చేయడం ఇది తొలిసారి కాదు.2006-08లో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒకసారి టీటీడీ ఛైర్మన్‌గా భూమన పని చేశారు. భూమన పదవిలో ఉన్నపుడే దళిత గోవిందం వంటి పథకాలను టీటీడీ ప్రవేశపెట్టింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న భూమన 2019 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, రాబోయే ఎన్నికల్లో తిరుపతి టికెట్‌ను తనయుడు అభినయ్ రెడ్డికి కేటాయించాలని జగన్ ను భూమన కోరుతున్నారు. తాజాగా భూమనను టీటీడీ ఛైర్మన్‌గా నియమించడంతో అభినయ్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది. భూమన..ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లేనని టాక్ వస్తోంది.