అయిదుగురు క‌లిసి సీట్ల ఎంపిక‌.. తేలే విష‌య‌మేనా?

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌పడుతున్నాయి. దీంతో ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌ల వ్యూహాలు, క‌స‌ర‌త్తుల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి. ముందుగా పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను సిద్ధం చేసే దిశ‌గా ప్ర‌ణాళిక‌ల్లో మునిగి తేలాయి. ఒక్క సీటు కోసం ఇద్ద‌రి కంటే ఎక్కువ నేతల మ‌ధ్య పోటీ, త‌మ వ‌ర్గం వాళ్ల‌కే టికెట్లు ద‌క్కాల‌నే అగ్ర నేత‌ల ప‌ట్టు.. ఇలాంటి స‌మ‌స్య‌లు పార్టీల‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఇక తెలంగాణ‌లో బీజేపీ విష‌యానికి వ‌స్తే సీట్ల ఎంపిక బాధ్య‌త‌ను ఏకంగా అయిదుగురికి అప్పగించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న బీజేపీ.. అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించింది. ముందుగా ఏకాభిప్రాయం ఉన్న సీట్ల ఎంపిక‌పై ధ్యాస పెట్టింది. అందుకు వీలుగా రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ ఎంపీ కె.ల‌క్ష్మ‌ణ్‌, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ ఈట‌ల రాజేంద‌ర్‌, జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ విడివిడిగా అభ్యర్థుల జాబితా రూపొందించ‌నున్నారు. ఈ జాబితాలను ప‌రిశీలించిన త‌ర్వాత ఈ అయిదుగురు ఏకాభిప్రాయానికి వ‌చ్చే సీట్ల‌తో కూడిన లిస్ట్‌ను ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది.

ఈ అయిదుగురు క‌లిసి ఏకాభిప్రాయానికి వ‌చ్చే సీట్లు రాష్ట్రంలో మూడో వంతు ఉంటాయ‌ని స‌మాచారం. దీని ప్ర‌కారం మొద‌టి జాబితాలో 35 నుంచి 40 సీట్ల వ‌ర‌కూ అభ్య‌ర్థులు ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. కానీ ఆ త‌ర్వాతే అస‌లైన స‌మ‌స్య క‌లుగుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ అయిదుగురు నేత‌లు త‌మ‌కు న‌చ్చిన అభ్య‌ర్థుల‌నే, త‌మ వ‌ర్గం నేత‌ల‌నే ఎన్నిక‌ల్లో నిల‌బెట్టాల‌ని ప‌ట్టుబ‌డితే ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌. మ‌రి వీళ్ల‌ను బుజ్జ‌గించి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను అధిష్ఠానం ఎలా ఖ‌రారు చేస్తుంద‌న్న‌ది చూడాలి.