బుగ్గన మిస్సింగ్…నెటిజన్ల ట్రోలింగ్

Buggana Rajender Reddy
Buggana Rajender Reddy

ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వాటికోసం సీఎం జగన్ పడుతున్న తిప్పలు….గత కొద్ది రోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే వ్యవహారంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో చేసిన అప్పుల మొత్తం 1,78,000 కోట్లు అని లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం ఆర్బీఐ పరిధిలో చేసిన అప్పులు మాత్రమే కేంద్ర మంత్రి వెల్లడించారని, వాటికి సంబంధం లేకుండా చేసిన అప్పుల కుప్ప ఇంకా పెద్దదిగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు.

కరోనా పేరు చెప్పి 40 వేల కోట్ల అప్పు చేసే అవకాశం దొరికిందని, దానికి అదనంగా ఇతర వనరులతో మరిన్ని అప్పులు చేశారని దుయ్యబట్టారు. గత నాలుగేళ్లలో వైసీపీ సర్కార్ 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ఇవి కాకుండా రకరకాల ఫండ్స్ ను దారి మళ్లించి కూడా జగన్ లబ్ధి పొందారని పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఏపీ అప్పులపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కనిపించడం లేదని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పిట్టకథలు చెప్పే బుగ్గన ఇప్పుడు ఏమయ్యారు అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన, మీడియా ప్రతినిధులతో మాట్లాడిన చాలా పొందికగా మాట్లాడే బుగ్గన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అంటూ ఏకిపారేస్తున్నారు. అయితే, ఏపీ ప్రభుత్వం రెండు రోజులకు ఒకసారి వెయ్యి కోట్ల రూపాయలు అప్పు చేస్తుందని, ఆ అప్పుల వ్యవహారాలని ఢిల్లీలో ఉండి బుగ్గనే సెట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అప్పు అనే మాట వినిపించగానే రెక్కలు కట్టుకొని బుగ్గన ఢిల్లీలో వాలిపోతున్నారని, ఇక పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లే పని కూడా బుగ్గనకే జగన్ అప్పగించారని టాక్ వస్తోంది. వాస్తవంగా అయితే అప్పులపై ఇంత రాద్ధాంతం జరుగుతున్న సమయంలో ఏ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి అయినా ప్రతిపక్షాల ఆరోపణలు ఖండించడం సహజం. ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి అధికారిక గణాంకాలు ఇవి, మేము ఇంత అప్పే చేశాం అని విపక్ష నేతల నోళ్లు మూయించాల్సిన బాధ్యత ఆర్థిక శాఖా మంత్రిపై ఉంటుంది. కానీ, అందుకు భిన్నంగా గతంలో చీమ చిటుక్కుమంటే ప్రెస్ మీట్ పెట్టే బుగ్గన ఇప్పుడు తన శాఖపై ఇంతగా రాద్ధాంతం జరుగుతున్నా మీడియా ముందుకు రాకపోవడం, కనీసం సోషల్ మీడియా స్పందించకపోవడం విశేషం.