మైనారిటీలకు కేసీయార్ ‘లక్ష’ తాయిలం ?

ఎన్నికలకు దగ్గరపడుతున్న నేపధ్యంలో కేసీయార్ కు ఎక్కడెక్కడి మైనారిటీలు, సామాజికవర్గాలు గుర్తుకొచ్చేస్తున్నాయి. ఒకసారి ఉద్యోగులంటారు. మరోసారి నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ అంటారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులకు ఆర్ధిక సాయమంటారు. ఏదిచేసినా రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడం కోసమే అన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా మైనారిటిలకు నూరుశాతం సబ్సిడితో లక్షరూపాయల రుణాలను ఇవ్వటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

మైనారిటీలంటే ముస్లింలు, క్రిస్తియన్లు మాత్రమే కాదు. తెలంగాణాలో ఉంటున్న సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు కూడా ఉన్నారు. సిక్కు, జైనులు, పార్శీల్లో పేదలున్నారా లేదా అన్న విషయమై సరైన క్లారిటిలేదు. ఎందుకంటే వీళ్ళు జనాభారీత్యా మైనారిటీలే కావచ్చు కానీ ఆర్ధికంగా మంచి స్ధితిలోనే ఉండే అవకాశముంది. అయినా సరే ఎవరినీ వదిలే ఉద్దేశ్యంలో కేసీయార్ లేరు. అందుకనే కలిపి మైనారిటీలందరికీ లక్ష రూపాయల రుణాన్ని అందించాలని డిసైడ్ చేసింది.

డబ్బులు అవసరమైన వాళ్ళు ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలంగాణా స్టేట్ క్రిస్తియన్, మైనారిటి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించటానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. మైనారిటీల సంక్షేమం కోసం 2014-23 మధ్యలో రు. 8,581 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో మైనారిటీల ఓట్లు చాలా కీలకమని కేసీయార్ గుర్తించారు. ఎందుకంటే ఫైట్ చాలా టైటుగా జరిగినపుడు గెలుపోటముల మధ్య తేడా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ తేడాను 1-2 శాతాల ఓట్లు కూడా మార్చేస్తాయి.

అందుకనే కేసీయార్ వ్యూహాత్మకంగా మైనారిటీల ఓట్లపై దృష్టిపెట్టారు. మిగిలిన మైనారిటి వర్గాల సంగతి ఎలాగున్నా ముస్లింల ఓట్లుమాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఓల్డ్ సిటిలో మెజారిటి ఓట్లు ముస్లింలవే. అలాగే తెలంగాణా వ్యాప్తంగా కనీసం 30 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు గెలుపోటములను డిసైడ్ చేస్తాయనే అంచనా ఉంది. అందుకనే గెలుపుకోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని కేసీయార్ డిసైడ్ అయ్యారు. కాబట్టి సడెన్ గా మైనారిటీల కోసం అని నిధుల పంపిణీకి రెడీ అయిపోయారు.