నెల‌కు ప‌దిరోజులు చంద్ర‌బాబు అక్క‌డే.. మాస్ట‌ర్ ప్లాన్!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే వ్యూహంతోపాటు.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనూ ఆయ‌న ఈ సారి భారీ మెజారిటీద‌క్కించుకుని వైసీపీ నాయ‌కుల‌కు షాక్ ఇవ్వ‌డంతోపాటు.. వారి వ్యూహాల‌ను కూడా ప‌టాపంచ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

తాజాగా సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటి కోసం.. భూమి పూజ చేశారు. ఎలాంటి చ‌డీ చ‌ప్పుడు లేకుండా.. చంద్ర‌బాబు ఇక్క‌డ రెండు ఎక‌రాల్లో ఇంటి నిర్మాణం చేప‌ట్టనున్నారు. దీనిలోనే పార్టీ కార్యాల‌యంతో పాటు.. ఆయ‌న ఇంటిని కూడా నిర్మించే ప్లాన్ చేశారు. ఇది వ‌చ్చే మూడు మాసాల్లోనే పూర్తి చేసేలా కాంట్రాక్ట‌ర్‌తో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా కార్య‌క్ర‌మాల‌తోపాటు.. రాష్ట్ర‌స్థాయి నేత‌ల‌కు కూడా ఇక్క‌డవిడిది ఏర్పాటుకు ప్ర‌త్యేకంగా వ‌స‌తులు క‌ల్పించ‌నున్నారు.

కుప్పంలో ఇంటి నిర్మాణం పూర్తి అయితే.. చంద్ర‌బాబు నెల‌కు ప‌దిరోజుల పాటు ఇక్క‌డే ఉండి.. సీమ రాజ‌కీయాల్లోప్ర‌ధాన పాత్ర పోషించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సీనియ‌ర్లు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీమ నేత‌ల‌ను ఉండ‌వ‌ల్లిలోని ఇంటికి పిలుచుకుని చ‌ర్చిస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్త‌న్నారు. అయితే.. దీనివ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేదు. ఎవ‌రు ఏం చెబుతున్నారో.. కూడా తెలియని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ నేత‌లు.. టీడీపీ లొసుగుల‌ను త‌మ‌కు అనుకూలం గా మార్చుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కుప్పంలో చంద్ర‌బాబును ఓడించాల‌నేది వైసీపీ వ్యూహం. దీంతో చంద్ర‌బాబు ఇక్క‌డ ఇంటిని నిర్మించుకోవ‌డం ద్వారా.. స్థానిక రాజ‌కీయ‌ల‌పై మ‌రింత ప‌ట్టు పెంచుకుని వాటికి అనుగుణంగా త‌న వ్యూహాల‌ను మార్చుకునే ఉద్దేశంతో ఉన్నార‌ని.. ఇది వ‌ర్క‌వు ట్ అయితే.. ఇక‌, కుప్పంలో భారీ మెజారిటీ ద‌క్కించుకోవ‌డంతోపాటు సీమ‌లోనూ.. పార్టీని ప‌రుగులు పెట్టించ‌డం ఖాయ‌మ‌ని సీనియ‌ర్లుచెబుతున్నారు.