అమ‌రావ‌తి మ‌న అంద‌రిదీ: జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా రాజ‌ధాని అమ‌రావ‌తి గురించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో అధికారం చేప‌ట్టి నాలుగేళ్లు గ‌డిచినా.. క‌నీసం ఏ వేదిక‌పై నుంచి కూడా అమ‌రావ‌తి అన్న మాట ప‌ల‌క‌ని సీఎం జ‌గ‌న్ .. తాజాగా అమ‌రావ‌తి గురించి మాట్లాడారు. రాజ‌ధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆర్‌-5 జోన్ లో పేద‌ల‌కు ప‌ట్టాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీనికి అనేక ష‌ర‌తులు కూడా ఉన్నాయ‌నుకోండి.

అయితే, ఆయా ప‌ట్టాల పంపిణీ అయిపోయిన ద‌రిమిలా..ఇక్క‌డ ఇళ్ల నిర్మాణానికి ఈ రోజు సీఎం జ‌గ‌న్ శంకు స్థాప‌న చేశారు. అదేస‌మ‌యంలో కొందరు ల‌బ్ధి దారుల‌తోనూ ప‌నులు ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… అమ‌రావ‌తిపై వ్యాఖ్య‌లు చేశారు. “అమ‌రావ‌తి మ‌న అంద‌రిదీ!” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అమ‌రావ‌తి వేర‌ని.. ఇప్పుడు ఇది ‘సామాజిక అమ‌రావ‌తి’గా మార్పు చెందింద‌ని చెప్పారు.

పేదలకు అండగా మార్పు మొదలైందన్న సీఎం జ‌గ‌న్‌.. సామాజిక అమరావతిగా మార్పుకు శ్రీకారం చుట్టామ‌ని చెప్పారు. ఇకపై అమరావతి మనందరి అమరావతి అనే భావ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తామన్నారు. అమ‌రావ‌తిని వ్య‌తిరేకించామ‌ని దుష్ట‌చ‌తుష్ట‌యం ప్ర‌చారం చేసింద‌ని.. కానీ, రాష్ట్రం బాగుండాల‌నే మూడు రాజ‌ధానులు తీసుకువచ్చామ‌న్నారు. అమ‌రావ‌తిలో శాస‌న రాజ‌ధాని ఉంటుంద‌ని..ఇది ఎక్క‌డికీ పోద‌ని చెప్పారు.

తాము అమ‌లు చేస్తున్న సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయిందని సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. మంచి చేసే కార్యక్రమాన్ని అడ్డుతగలడమే వీరి లక్ష్యమ‌ని ప్ర‌తిప‌క్షాల‌పై నిప్పులు చెరిగారు. అక్క చెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామ‌ని చెప్పారు. కోర్టు కేసులతో దీనినీ అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమ‌ర్శ‌లు గుప్పించారు. పెత్తందారులపై పేదవాడు సాధించిన విజయం ఇది అంటూ.. అమ‌రావ‌తిలో ఇచ్చిన ప‌ట్టాలపై వ్యాఖ్యానించారు. చరిత్ర ఉన్నంతవరకూ ఈ రోజును మరిచిపోలేని రోజుగా ఆయ‌న పేర్కొన్నారు.